దేశంలోనే వ్యవసాయ రంగాన్ని నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. శనివారం రైతు దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. సత్తుపల్లి మండలం కొత్తూరు రైతువేదిక నుంచి కాకర్లపల్లి రైతువేదిక వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పథకాల శకటాలతో ప్రదర్శన చేశారు.
సత్తుపల్లి రూరల్, జూన్ 3: వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సాగు రంగంలో రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సత్తుపల్లి మండలంలో శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాలు, రైతు ఉత్పత్తులు, 200 అడుగుల బతుకమ్మ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్రల భారీ కటౌట్లతో తీర్చిదిద్దిన సుమారు 200 ట్రాక్టర్లతో కొత్తూరు రైతువేదిక నుంచి కాకర్లపల్లి రైతువేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించారు. అనంతరం కాకర్లపల్లిలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున 31 రైతు వేదికలను నిర్మించి రైతులకు అందించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 85,229 మంది రైతులకు రూ.798 కోట్ల మేర రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాకర్లపల్లిలో సీసీ రోడ్లు నిర్మాణం కోసం రూ.5.50 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. కాగా, కాకర్లపల్లి రైతువేదిక స్థల దాత కంచర్ల సత్యనారాయణ దంపతులను సన్మానించారు. ఉత్తమ రైతు పుచ్చకాయల నర్సారెడ్డిని కొత్తూరు రైతువేదికలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు సత్కరించారు.
అంబరాన్నంటిన సంబుఎరాలు..
దశాబ్ది వేడుకలు, రైతు దినోత్సవం సందర్భంగా కొత్తూరు రైతువేదిక వద్ద సంబురాలు అంబరాన్నంటాయి. నవధాన్యాలతో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి చిత్రపటాలను ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ మధు పరిశీలించి చిత్రకారులను అభినందించారు. రెండు రైతు వేదికల వద్దకు అధిక సంఖ్యలో హాజరైన రైతులు సహఫంక్తి భోజనాలు చేశారు. ఎమ్మెల్సీ తాతా మధును వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు సత్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సూర్యనారాయణ, శ్రీనివాసరావు, నర్సింహారావు, సుభాషిణి, శ్రీనివాసరావు, రామానుజం, కరుణాకర్, దొడ్డా హైమావతి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, వనమా వాసు, కూసంపూడి రామారావు, యాగంటి శ్రీనివాసరావు, చల్లగుళ్ల కృష్ణయ్య, తుమ్మూరు శ్రీరామప్రసాద్, చిలుకుర్తి కృష్ణమూర్తి, మందపాటి వెంకటరెడ్డి, మామిళ్లపల్లి కృష్ణయ్య, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఒగ్గు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.