కారేపల్లి, సెప్టెంబర్ 10 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి), కామేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిరప తోటలో పని చేస్తున్న రైతు గుగులోతు బావుసింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పక్కనే ఉన్న రైతులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా కారేపల్లి మండల పరిధిలోని మేకలతండాలో గూగులోతు మోహన్ రావుకు చెందిన ఆవు మేత మేస్తుండగా పిడుగుపడడంతో మృతి చెందింది. పాడి ఆవు మృతి చెందడంతో మోహన్ రావు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించిందని, కావునా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు. ఎటువంటి సమస్యల ఉన్నా స్థానిక పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి తెలుపాలని పేర్కొన్నారు.