– కారేపల్లి తాసీల్దార్కు గుట్టకింద గుంపు గ్రామ సర్పంచ్ వినతి
కారేపల్లి, మే 25 : కారేపల్లి మండల పరిధిలోని గుట్టకింద గుంపు గ్రామ పంచాయతీలో గల గంగాదేవి గుట్టలో మట్టి త్రవ్వకాలను అడ్డుకోవాలని స్థానిక సర్పంచ్ ఉండం లక్ష్మీనరసింహతో కలిసి స్థానికులు సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదాం పేరుతో సంబంధిత కాంట్రాకర్ గుట్ట మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గ్రామస్తులంతా ఏకమై అనేక దఫాలు మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ పదే పదే మట్టి త్రవ్వి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఆ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే గంగాదేవి గుట్టను అక్రమంగా త్రవ్వి పచ్చని పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ కుల దైవం కాళికాదేవి విగ్రహం, సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు గద్దెలు, గంగ విగ్రహాలకు రక్షణ లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతుండడం వల్ల అవి కూలి కింద పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనుల ఆరాధ్య దైవాలు అంటే అంత చిన్న చూపా అని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక గిరిజనులైన తమ మనోభావాలు దెబ్బతీస్తే ఎంత వరకైనా ఉద్యమిస్తామన్నారు. ఈ విషయమై మండల తాసీల్దార్, కారేపల్లి సబ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రాలను అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని అక్రమ మట్టి దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పచ్చని పర్యావరణాన్ని తలపించే గంగమ్మ గుట్ట త్రవ్వకాలకు అడ్డుకట్ట వేసి కాపాడాలని అధికారులను కోరారు. గుట్ట తవ్వడం ఆపకపోతే అఖిల పక్షం సహకారంతో నిరంతర పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతి రావు, తోగర శ్రీనుతో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.