వర్షాలు విస్తారంగా కురవడం.. వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నాణ్యమైన పత్తి దిగుబడి చేతికొస్తుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. ఇప్పటికే 15 రోజుల నుంచి పత్తి రైతులు కూలీల ద్వారా పత్తిని తీయించి విక్రయిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఒకవైపు ఎన్నికల బిజీ ఉన్నా రైతులు మాత్రం చేతికి వచ్చిన పత్తి పంటను తీసి విక్రయిస్తున్నారు. నిరుడు పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతులు ఈ ఏడాది కూడా సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. ఈ ప్రాంతాల్లో నాణ్యమైన పత్తి దిగుబడి వస్తుండడంతో పత్తికి మంచి డిమాండ్ పలుకుతోంది. దీంతో రైతులు కూడా ఈ పత్తిపైనా కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 2,00,525 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పంటల సాగుకు వాతావరణం అనుకూలమైంది. దీంతో అన్ని పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. వరి, పత్తి పంటలను ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో దిగుబడులు కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే 15 రోజుల నుంచి పత్తి రైతులు కూలీల ద్వారా పత్తిని తీయించి విక్రయాలు చేస్తున్నారు.
జిల్లాలో 1,22,224 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 144 శాతానికి పైగా పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అధికారులు సూచించిన లక్ష్యాన్ని దాటి పత్తి పంటను వేశారు. 1,39,598 ఎకరాల్లో పత్తిసాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా అంతకు మించి 2,00,525 ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. నిరుడు కూడా పత్తిపంటకు డిమాండ్ ఉండడం, ఈ ఏడాది అదునుకు వర్షాలు కురవడంతో రైతులందరూ పత్తిపంటపైనే ఆశలు పెట్టుకున్నారు.
పత్తి పంట విక్రయాలకు రైతులకు ఎలాంటి లోటు లేకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిన్నింగ్ కాటన్ మిల్లులు వద్ద సంబంధిత యంత్రాంగాన్ని సిద్ధం చేయడంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సుజాతనగర్లోని మంజిత్ కాటన్ మిల్లు, కారేపల్లిలోని శ్రీలక్ష్మి కాటన్ మిల్లు, అశ్వాపురంలోని శ్రీరామ కాటన్ మిల్లు, లక్ష్మీపురంలోని అనుశ్రీ ఇండస్ట్రీస్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు విక్రయాలు జరుపుకునేందుకు పంటల వద్దనే తేమ శాతం తెలిపే యంత్రాలను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించడంతో కేంద్రాల వద్ద ఆ పరికరాలను ఉంచారు. ఇందుకు సంబంధంచిన పత్తి కూపన్లు కూడా ఇచ్చేశారు. పత్తిపంటకు ప్రభుత్వం రూ.7020గా మద్దతు ధరను కూడా ప్రకటించింది.
పత్తి సాగుతో రైతుల వద్ద కూలీలకు ఉపాధి లభిస్తోంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలతోపాటు ప్రైవేటు కేంద్రాల్లో కూడా పత్తి విక్రయాలు జరుగుతుండడంతో రైతులు ప్రైవేటులో కూడా తమ పత్తి పంటను విక్రయిస్తున్నారు. దీంతో అటు పత్తి తీసే పనుల్లోనూ, ఇటు లోడింగ్ చేసే పనుల్లోనూ కూలీలకు ఉపాధి పెరిగింది. లోడింగ్లో ప్రతి రోజూ 200 మంది కూలీలు పనిచేస్తున్నారు.
ఈ ఏడాది రైతులు పత్తి పంట బాగా వేశారు. నిరుటి కంటే ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంతో అంచనాలకు మించి పత్తి సాగు అవుతున్నట్లయింది. పత్తి పంట కొనుగోలు కోసం సీసీఐ నాలుగు చోట్ల కేంద్రాలను అందుబాటులో ఉంచింది. దళారులను నమ్మి మోసపోవద్దు. ఆధార్ నెంబర్ను నమోదు చేసుకుని విక్రయానికి తీసుకురావాలి. ప్రభుత్వం రూ.7020 మద్దతు ధరను ప్రకటించింది. రైతులు వారి బ్యాంకు ఖాతాలను ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి. ఇప్పటి వరకు 5,960 మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేశాం.