భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అది మారుమూల పల్లె.. గత పాలకుల హయాంలో కనీస వసతులు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు అందించింది. గతంలో సులానగర్లో కలిసి ఉన్న చింతలంకను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేసింది. అంతేకాదు, ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ పల్లెలో ఊరంతా రైతులే.. ప్రభుత్వ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయి. వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ఓడీఎఫ్ జాబితాలో చేరింది.
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి నోచుకోని పల్లె. జిల్లాకేంద్రం నుంచి విసిరేసినట్లుగా ఉండే మారుమూల పల్లె. కనీస వసతులు లేక గ్రామస్తులు ఇబ్బందిపడిన గ్రామం. అలాంటి పల్లె తెలంగాణ సిద్ధించిన తర్వాత పెద్ద పంచాయతీ సులానగర్ నుంచి విడిపోయి కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఆ గ్రామమే టేకులపల్లి మండలంలోని చింతలంక. అప్పటి నుంచి గ్రామం ప్రగతి బాట పట్టింది. గ్రామంలో ప్రతి ఇంటికీ కనీసం ఒక్క ప్రభుత్వ పథకమైనా అందింది.
కొత్త పంచాయతీకి కొత్త జీపీ భవనం..
750 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. దీంతో పంచాయతీ పూర్తి ఓడీఎఫ్ గ్రామంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆదర్శ పంచాయతీగా ఎంపికై ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల నిధులు పొందింది. నిధులతో కొత్త పంచాయతీ భవనం అందుబాటులోకి వచ్చింది. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పుడు గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్యార్డ్, పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చాయి. భూగర్భజలాల పెంపునకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది.
ఊరంతా రైతులే..
228 కుటుంబాలు ఉన్న పంచాయతీలో 25 కుటుంబాలకు తప్ప ప్రతిఒక్కరికీ ఎకరా భూమైనా ఉంది. వారికున్నది తక్కువ భూమే అయినప్పటికీ దానినే నమ్ముకుని గ్రామస్తులు జీవిస్తున్నారు. రైతులు ఏటా రెండు సీజన్లకు రైతుబంధు సొమ్ము అందిస్తుండడంతో దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. గ్రామస్తులు ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటూ వ్యవసాయం కొననసాగిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రయోజనం..
నేను గర్భిణిగా ఉన్నప్పుడు సులానగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందాను. రామవరం ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యులు నాకు ప్రసవం చేశారు. సర్కార్ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. అమ్మఒడి వాహనమే నన్ను ఉచితంగా ఆస్పత్రికి తరలించింది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
– తెల్లం మౌనిక, కేసీఆర్ కిట్ లబ్ధిదారు
పోషకాహారం అందుతున్నది..
గర్భిణులకు అందుతున్న న్యూట్రిషిన్ కిట్ బలవర్ధకమైనది. నేను వైద్యపరీక్షలు చేయించుకున్నప్పుడు వైద్యులు కొద్దిగా రక్తహీనత ఉందని గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లో ఆహారం తీసుకున్న తర్వాత రక్తహీనత తగ్గింది. తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగుపడింది. వైద్యసిబ్బంది సూచనల మేరకు సిరప్లు, పాలల్లో నూట్రిషన్ పౌడర్ వేసుకుని తాగుతున్నాను. కిట్లో ఉండే పదార్థాలు బయట కొనుక్కోవాలంటే చాలా డబ్బు వెచ్చించాలి.
– కోరం సుహాసిని, నూట్రిషన్ కిట్ లబ్ధిదారు
ఠంచను గా రైతుబంధు..
రైతుబంధు ప్రారంభమైన ఐదేళ్ల నుంచి నేను ప్రతి సీజన్కు రైతుబంధు తీసుకుంటున్నాను. బయట రైతుబంధు నిలిచిపోతుందని వస్తున్న వార్తలో వాస్తవం లేదు. సీఎం కేసీఆర్ రైతులపై ప్రత్యేక అభిమానంతో పథకాలు అమలుచేస్తున్నారు. ఏటా సీజన్కు ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. రైతుబంధు వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పాయి.
– కంగాల గంగరాజు, రైతుబంధు లబ్ధిదారు
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నాం..
మాది చిన్న పంచాయతీ. ప్రభుత్వం అందించిన కొత్త ట్రాక్టర్తో ప్రతిరోజు పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాం. గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది. గ్రామం పూర్తిస్థాయి ఓడీఎఫ్ అయింది.
– ఇ.దుర్గాభవాని,పంచాయతీ కార్యదర్శి,