భద్రాద్రి కొత్తగూడెం, మే 14 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరో వైపు గాలి దుమారాలతో యాసంగి రైతులు ఆందోళనకు గురవుతున్న వేళ.. ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 136 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. వాటిల్లో 58 కేంద్రాలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరనే లక్ష్యం కాగా.. ఇప్పటికే 10,940 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమచేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు చేరుస్తోంది. అయితే, కొనుగోలు కేంద్రాలకు వచ్చేముందే రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, చెత్త, తాలు, పొల్లు, పొట్టు, మట్టి లేకుండా శుభ్రపరిచి తీసుకురావాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఓ వైపు అకాల వర్షాలు, మరో వైపు గాలి దుమారాలతో యాసంగి రైతులు ఆందోళనకు గురవుతున్న వేళ.. ధాన్యం కొనుగోళ్లను వడివడిగా జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 136 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. 58 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. యాసంగిలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 10,940 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దానికి సంబంధించిన నగదును కూడారైతుల ఖాతాల్లో జమచేసింది.
136 కొనుగోలు కేంద్రాల ద్వారా..
జిల్లాలో యాసంగి వరి పంట కోతకు రావడంతో 136 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పీఏసీఎస్ ద్వారా 105, జీసీసీ ద్వారా 28, ఐకేపీ ద్వారా 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ గ్రేడ్ రకానికి రూ.2,060, కామన్ రకానికి రూ.2,040 చొప్పున మద్దతు ధర చెల్లిస్తోంది. అలాగే అన్నదాతల కష్టం అక్రమార్కుల పాలుకాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పొరుగు రాష్ర్టాల ధాన్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ను రంగంలోకి దించింది. అలాగే, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ధాన్యం మిల్లులకు చేరుస్తోంది. ఈ క్రమంలో కూలీలకు ఉపాధి కూడా లభిస్తోంది.
రైతులకు అధికారుల సూచనలు..
రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే సమయంలో పాటించాల్సిన సూచనలను వ్యవసాయ శాఖ తెలియజేస్తోంది. ఇందులో భాగంగా రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చేందుకు ముందే రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, చెత్త, తాలు, పొల్లు, పొట్టు, మట్టి లేకుండా శుభ్రపరిచి తీసుకురావాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తున్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ధాన్యం సాగు విస్తీర్ణాన్ని, ధాన్యంలోని వివిధ రకాల వివరాలను తెలియజేస్తారు. డీఏవో నేతృత్వంలోని ఏవో, ఏఈవోలు ఆయా కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యాన్ని నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటేనే కొనుగోలుకు అనుమతిస్తున్నారు. సదరు అధికారి, తహసీల్దార్ కలిసి ఏయే గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడెప్పుడు కొనుగోలు కేంద్రాలకు తేవాలో అనే తేదీలను ఖరారు చేస్తున్నారు.
తడిసిన ధ్యాన్యాన్నీ కొనుగోలు చేసేలా..
అయితే ఇటీవల వచ్చిన అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. వడగళ్ల వానలు కర్షకుల కష్టాన్ని నీటిపాలు చేశాయి. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు నిర్ణయించింది. అలాగే తడిసిన ధాన్యమంతటినీ కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
136 కేంద్రాలు ప్రారంభించాం..
ఈ ప్రాంతంలో వరిసాగు ఆలస్యం కావడంతో పంట కోతలూ లేటయ్యాయి. ఈ క్రమంలో అకాల వర్షాల రావడంతో కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ముందుగా పంటలు కోసిన చోట ధాన్యం తడిసిపోయింది. అయితే తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అతడిసిన ధాన్యాన్ని ఆరబోసి తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 136 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే 58 కేంద్రాలను ప్రారంభించాం. ఆయా కేంద్రాల వద్ద గన్నీ బ్యాగ్లను అందుబాటులో ఉంచాం రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వేసవి సీజన్ కాబట్టి రైతులకు తాగునీరు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.
–ఎస్ త్రినాథ్బాబు. సివిల్ సప్లయి అధికారి