గతంలో ఆ పాఠశాల అరకొర వసతులతో అవస్థలు ఎదుర్కొన్నది. తాగునీటి సౌకర్యం లేదు. సరిపడా తరగతి గదులు లేవు. వర్షమొస్తే పాఠశాల ఆవరణం చెరువును తలపించేది. మూత్రశాలలు, మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. ఒంటికి, రెంటికి వెళ్లాలంటే ఉగ్గబట్టాల్సిందే.. ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల కష్టాలు చెప్పనలవి కాదు. కానీ ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దత్తత తీసుకొని బడిలో సకల సౌకర్యాలు కల్పించారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 265 మంది విద్యార్థులు ఉన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమ బోధన నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడుంది.? అక్కడ ఒనగూరిన సౌకర్యాలు ఏమిటి.? వాల్ పెయింటింగ్స్తో ఆకట్టుకుంటున్న దృశ్యాలను చూడాలంటే ఖమ్మం నగరంలోని రోటరీనగర్ పాఠశాలకు వెళ్లాల్సిందే.
-ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 3
చాలీచాలని గదులు, అరకొర సౌకర్యాలతో సతమతమైన ఆ పాఠశాల దశ తిరిగింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషికి తోడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దత్తతతో నేడు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. అదే.. ఖమ్మంలోని రోటరీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఈ పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది.
గతంలో ఈ పాఠశాలలో 210 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 265 మంది ఉన్నారు. 6 నుంచి 10 తరగతుల వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమాలతో నడుస్తున్నది. ప్రస్తుతం ఈ పాఠశాలకు రోటరీనగర్, గోపాలపురం, శ్రీనగర్కాలనీ, ఎల్బీనగర్, టేకులపల్లి, వైఎస్ఆర్ నగర్ తదితర సుదూర ప్రాంత కాలనీల నుంచి విద్యార్థులు వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన సుమారు 60 నుంచి 70 మంది తల్లిదండ్రులు.. ఈ పాఠశాలల్లో మెరుగైన వసతులను గమనించి తమ పిల్లలను చేర్పించారు. ఇక్కడ విద్యాబోధన తాము ఆశించిన దానికన్నా సంతృప్తికరంగా ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు తోట విక్రమ్, మైఖేల్తేజకు ఈ సంవత్సరం నవోదయ కేంద్రీయ విద్యాలయంలో సీట్లు లభించాయి. తరగతి గదుల్లో ఉన్న వాల్ పెయింటింగ్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సబ్జెక్టులోని పాఠ్యాంశాలు, తెలంగాణ నాయకుల చిత్రపటాలను గోడలపై వేయడం ద్వారా తెలంగాణ చరిత్ర తెలుసుకోవడంతోపాటు బొమ్మలతో బోధన సులువుగా ఉంటోంది.
ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చుతో పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ను సమకూర్చుతున్నారు. మంత్రి అజయ్కుమార్ సహకారంతో పాఠశాలకు ‘మన ఊరు – మన బడి’ ప్రణాళిక కింద డైనింగ్ హాల్, లైబ్రరీ, ల్యాబ్ కోసం నాలుగు గదులు నిర్మిస్తే ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు. మంత్రి అజయ్ ఈ పాఠశాలకు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఏటా నోట్ పుస్తకాలు అందజేస్తున్నారు. ఇవి పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండడంతోపాటు పచ్చని మొక్కలు అక్కడి విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మంత్రి అజయ్ చొరవతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.36 లక్షల సీఎస్ఆర్ నిధులతో వాల్ పెయింటింగ్స్తో కూడిన నాలుగు తరగతి గదులను నిర్మించింది. ఒకప్పుడు వర్షం పడితే నీళ్లతో నిండి చెరువును తలపించేలా ఉండేది ఈ పాఠశాల. ఇప్పుడు ఎత్తులో నిర్మించడంతో ఆకర్షణీయంగా కన్పిస్తోంది. కాగా పాఠశాలలో తమ సొంత ఖర్చుతో ఉపాధ్యాయులు స్వచ్ఛ కార్మికురాలిని నియమించి పాఠశాలను శుభ్రంగా ఉంచుతున్నారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ వారు ఈ పాఠశాలకు సోలార్ ప్యానల్ను, వాటర్ ప్యూరిఫయర్ను తమ సీఎస్ఆర్ నిధులతో అందజేశారు.
వచ్చే విద్యాసంవత్సరం నాటికి విద్యార్థుల సంఖ్యను 400 వరకు పెంచేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. మంత్రి అజయ్ సహకారంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతాం. టెన్త్ ఫలితాల్లోనూ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులందరమూ కలిసి నగదు బహుమతులను అందజేస్తుంటాం.
-మోతుకూరి మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఉపాధ్యాయులంతా ఐక్యతతో ఉండి ఒకే మాట, ఒకే బాటగా విద్యార్థులను క్రమశిక్షణ గల వారిగా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వ సహకారం, మంత్రి చొరవ వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో పాఠశాలకు మహర్దశ పడుతుంది.
-పీ.పద్మ, సోషల్ ఉపాధ్యాయురాలు