రఘునాథపాలెం, మే 24: పేదోళ్లు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస్పీ స్థలం ఆక్రమణకు గురైనా రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారులు కనీసం అటుగా కన్నెత్తి చూసినది లేదు. అధికారుల పట్టింపులేనితనాన్ని అవకాశంగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ నేత ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆ ఇంటికి తప్పుడు పత్రాలు సృష్టించి, దొడ్డిదారిన ఇంటినెంబర్ తెచ్చుకొని హక్కులను కూడా పొందాడు. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని విలువైన ఎన్నెస్సీ స్థలంలో కాంగ్రెస్ నేత అక్రమ ఇంటి నిర్మాణంపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకున్నాం.. ఇంటినెంబరు కేటాయించండి సార్ అని కార్పొరేషన్ అధికారులను అశ్రయిస్తే.. పట్టా సర్టిఫికెట్ ప్రభుత్వం ఇచ్చినదేనా..? రెవెన్యూ ఆఫీస్ నుంచి జన్యునిటీ సర్టిఫికెట్ తెచ్చుకో.. లేదంటే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకో అంటూ పలు ప్రశ్నలు సంధించి పని చేయకుండానే పంపించేస్తారు.. కానీ ఓ కాంగ్రెస్ నేత ఎన్నెస్పీ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న ఇంటికి మాత్రం ఏ కారణాలు అడగకుండా ఇంటి నెంబరు కేటాయించి సర్వహక్కులు కల్పించేశారు. ఖమ్మం నగరం రఘునాథపాలెం బైపాస్కు ఆనుకొని ఎన్నెస్పీ కాలువకు ఆనుకొని ఎన్నెస్పీ స్థలంలో కట్టిన ఇంటికి నెంబరు కేటాయింపులోని ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఇదే తీరున వ్యవహరించారు.
కట్టిన ఇల్లు పక్కాగా ఎన్నెస్పీ స్థలంలో కనిపిస్తున్నా.. కనీసం విచారణ చేయకుండానే ఇంటి నెంబరు కేటాయించినట్లుగా స్పష్టమౌతోంది. పైగా ఇంటి నెంబరు కోసం తాను జతపరిచిన పట్టాలోని సర్వే నెంబరు.. కట్టిన ఇల్లు ఉన్న ప్రాంతం సర్వే నెంబరు వేర్వేరు ఐనా అధికారులు అవన్నీ ఏమీ పరిగణలోకి తీసుకోలేదు. సాగర్ కాలువకు ఆనుకొని ఇళ్లు కనిపిస్తున్నా.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకుండానే నెంబరు కేటాయించినట్లు తెలియవస్తోంది. ఇంటినెంబరు కేటాయించడంతో ఆక్రమించిన స్థలానికి లైసెన్స్ లభించిందని ఆక్రమణదారుడు మురిసిపోతున్నాడు. ఎన్నెస్పీ స్థలం ఆక్రమణ సజావుగా సాగిన అనంతరం ఇంటిముందు తూర్పుభాగం రోడ్డు స్థలం ఆక్రమణలో భాగంగా ఇంటిముందు భారీ షెడ్డు నిర్మాణాన్ని చేపట్టాడు. అంటే కాంగ్రెస్ నేత ఎన్నెస్పీ స్థలం కబ్జా బాగోతం ఇంటి నిర్మాణంతోనే ఆగిపోలేదనే అవగతమవుతోంది. అధికార పార్టీ ముసుగులో కాంగ్రెస్ నేత ఆక్రమణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని 8వ డివిజన్కు చెందిన ఎల్బీనగర్ ప్రాంతవాసులు కలెక్టర్ను కోరుతున్నారు.