బోనకల్లు, నవంబర్ 13 : నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పాఠ్య పుస్తకాలు మోసుకొస్తున్న ఆటో బోల్తాపడి విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ జి.స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివలింగం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ డి.రాములు యాదవ్ను బాధ్యులుగా పేర్కొన్నారు. దీంతో వారిని తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం బోనకల్లు మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ పాషా మాట్లాడుతూ.. ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు చాలా బాదాకరం, అన్యాయం అన్నారు.
గత దశాబ్ద కాలంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో, విధుల్లో నిబద్ధతతో వ్యవహరిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి అనూహ్య ఘటనను కారణంగా చూపి, నిర్దోషులను బాధ్యులుగా చూపడం ఉద్యోగుల్లో తీవ్ర నిరుత్సాహం, భయాందోళన, ఉద్యోగ భద్రతపై సందేహం కలిగించే పరిస్థితిని సృష్టించిందన్నారు. కావునా ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జి.మల్లికార్జున్, కార్యదర్శి మీరా పాల్గొన్నారు.