పాల్వంచ/ భద్రాచలం/ మామిళ్లగూడెం, జూన్ 24: నల్లగొండ జిల్లాలోని వైటీపీఎస్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో బుధవారం నిరసన తెలిపారు. పాల్వంచ కేటీపీఎస్ 5, 6 దశల్లోని ఉద్యోగులు, భద్రాచలం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ‘సేవ్ వైటీపీఎస్, సేవ్ టీజీ జెన్కో’ అంటూ నినాదాలు చేశారు.
