పాల్వంచ/ మణుగూరు టౌన్/ భద్రాచలం, జూలై 20: విద్యుత్రంగ ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని కేటీపీఎస్, బీటీపీఎస్ ఉద్యోగులు, టీజీపీఈజేఏసీ నేతలు, ఎన్పీడీసీఎల్ జిల్లా శాఖ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదీగాక, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల సామర్థ్యం, భద్రత, ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటి దృష్ట్యా వైటీపీఎస్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
వైటీపీఎస్ ఏహెచ్పీ, సీహెచ్పీల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్ శాఖల ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆయా సంఘాల నాయకులు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్, భద్రాచలం డీఈ కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాలు సోమవారం 23వ రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు, నాయకులు మాట్లాడుతూ.. వైటీపీఎస్ స్టేజ్-1, స్టేజ్-2లలో యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్లను ప్రైవేటీకరించే ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఉద్యోగుల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతా ఏకతాటి పైకి వచ్చి ఉద్యమించి హకులను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు.