ఖమ్మం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల షెడ్యూల్, నిబంధనలపై పోలీస్ కమిషనర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని అన్నారు. అదే రోజు నుంచి 10వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నామని, 13న స్రూటిని, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఎన్నికల నియమావళిని నికచ్చిగా అమలు చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ కార్యాలయంలోని పొలిటికల్ ఫంక్షనరీల ఫొటోలను 24గంటల్లోగా, ప్రభుత్వ స్థలాల్లోని రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను, వాల్ పెయింటింగ్లను 48గంటల లోగా తొలగించాలని, ప్రైవేట్ స్థలాల్లో 72 గంటల్లోగా తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఫ్లయింగ్ స్వాడ్లు, ఎస్ఎస్టి, వీఎస్టీ, ఎంసీఎంసీ, ఫ్లయింగ్ స్వాడ్ టీంలను ఇప్పటికే క్రియాశీలకం చేశామన్నారు. నామినేషన్ల స్వీకరణకు 10 రోజుల ముందు వరకు అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు, సహకరించాలని కలెక్టర్ కోరారు. సీపీ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు మెసేజ్లను ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డీసీపీ ప్రసాదరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.