ఖమ్మం, మార్చి 26 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అధికారులు తప్పుడు కేసు బనాయించి విచారిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కవితను జైలుకు పంపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ మంగళవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కవితకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ రాజకీయ దురుద్దేశంతో కేసుపెట్టి జైలుకు పంపడం బాధా కరమన్నారు. కవిత బెయిల్ పిటీషన్ ఏప్రిల్ 1న విచారణకు వస్తుందని తెలిపారు.
మహానేత కేసీఆర్, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడదని స్పష్టంచేశారు. లోకసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నదని, వాటిని తెలంగాణ ప్రజలు భగ్నం చేస్తారన్నారు. న్యాయవ్యవస్థ పట్ల తమకు అపారమైన గౌరవం, సంపూర్ణ విశ్వాసం ఉందని, కవిత నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. ఎంపీ వెంట వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ ఉన్నారు.