Palwancha | పాల్వంచ, జూలై 2 : పాల్వంచ పట్టణానికి అతి సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీ వద్ద ముర్రేడు వాగు ఉంది. దీనిపై దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వాగు అవతలి గ్రామాలైన పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలపాడు, అన్నారం, గుర్రాలకుంట గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నివించినా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రజల కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016లో రూ.9కోట్లు కేటాయించి బ్రిడ్జి, చెక్డ్యాం నిర్మాణాన్ని చేపట్టి 2019లో పూర్తి చేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు మేలు చేకూరడంతోపాటు భూగర్భ జలాలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక అవస్థలు
దశాబ్దాలుగా ముర్రేడు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అన్ని కాలాల్లో వాగు అవతలి గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. వర్షాకాలం వచ్చిందంటే నీళ్లలో నుంచి వాగు దాటి భయం భయంగా ఇళ్లకు వెళ్లేవారు. రాత్రి సమయాల్లో ములకలపల్లి మండలం పాతూరు మీదుగా చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వచ్చేది. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఆనాటి ప్రభుత్వాలు నిధుల లేమి కారణంతో పనులు ఆపేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బ్రిడ్జి, చెక్డ్యాం మంజూరు చేయించి సకాలంలో పూర్తి చేయించారు. దీంతో పై గ్రామాల ప్రజల కష్టాలు తీరాయి. ఆయా గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి కమ్ చెక్డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.
రైతులకు సాగునీటి సౌకర్యం
వాగుకు ఇరువైపులా చెక్డ్యాం నిర్మాణం వల్ల సాగునీటి వసతి కలిగింది. బ్రిడ్జి వద్ద నుంచి కిలోమీటర్కు పైగా నీరు నిలిచి ఉండడం వల్ల సమీప రైతులు కరెంటు మోటర్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తున్నారు. చెక్డ్యాం నిర్మాణం చేపట్టక ముందు వాగుకు ఇరువైపులా రైతులు వాగు నీటికి అడ్డుగా కట్టలు వేసుకుని పొలాలకు పారించుకోవాల్సిన దుస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు వాగు పక్కనే విద్యుత్ మోటర్లు పెట్టుకుని భూములకు సాగునీరు పెట్టుకుంటున్నారు. వాగులో నీరు ఎప్పుడూ నిల్వ ఉండడం వల్ల పాత పాల్వంచ, శ్రీనివాసకాలనీ, పాల్వంచ పట్టణంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. బావుల్లో 30 అడుగుల్లోనే నీరు లభిస్తున్నది.
పెరిగిన భూముల ధరలు
బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకముందు ఎకరం భూమి కేవలం రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు మాత్రమే ధర పలికేది. కానీ.. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంతో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఎకరం రూ.50లక్షలకు పైగా ధర పలుకుతున్నది. రోడ్డు వెంట ఉన్న భూములకు రూ.కోట్లలో ధర పలకడం విశేషం.
ఎంతో మేలు జరిగింది..
ఎన్నో ఏళ్ల నుంచి బ్రిడ్జి లేకపోవడం వల్ల వాగు అవతలి గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మా పొలాలు వాగు అవతల ఉండడంతో ఆక్కడికి వెళ్లాలంటే బాగా ఇబ్బందిపడే వాళ్లం. కానీ.. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత మా కష్టాలు తీరిపోయాయి. బ్రిడ్జితోపాటు చెక్డ్యాం నిర్మించడం వల్ల రైతులకు సాగునీటి వసతి కలిగింది. ఏ కాలమైనా నీరు పుష్కలంగా లభిస్తున్నది.
– కందుకూరి శేషయ్య, శ్రీనివాస కాలనీ, పాల్వంచ