చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగాల్లో పని చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, చర్మకారులు, రజకులు, దర్జీలు, చేనేత, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, స్వర్ణకారులు, చిరు వ్యాపారులు, కల్లు గీత, బీడీ, రిక్షా, పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, విద్యా వలంటీర్ల వంటి అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఈ-శ్రమ్’ను అమలు చేస్తున్నాయి. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యం సంభవించినా రూ.లక్ష పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందిస్తున్నాయి.
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 25: అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కార్మికశాఖలో పేరు నమోదు చేసుకొని గుర్తింపుకార్డు పొందినవారు ప్రమాదానికి గురైతే వారికి ఎక్స్గ్రేషియా అందిస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాల్లో విషాదం నిండింది. ఎంతో మంది అసంఘటిత కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు వీధిన పడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఈ- శ్రమ్’ అనే పథకాలు అమలు చేస్తున్నాయి. గుర్తింపు కార్డులు పొందిన వారికి బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి.
అర్హులు వీరే..
ఈ-శ్రమ్ కార్డు పొందే వారి వయస్సు 16 59 సంవత్సరాల మధ్య ఉండాలి. వారు ఆదాయ పన్ను పరిధిలోకి రాకూడదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేనివారు అర్హులు. వ్యవసాయం, అనుబంధ ఉపాధి విభాగాల్లో పనిచేసేవారు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నర్సరీల్లో పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణంతో పాటు అనుబంధ రంగాల్లో పని చేసేవారు, టైలరింగ్ పనిపై ఆధారపడేవారు, ఆటోమొబైల్, రవాణారంగం, చేతివృత్తుల పనివారు (చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షౌరవృత్తి, బ్యూటీపార్లర్, చర్మకారు, రజకులు), స్వయం ఉపాధి (వీధివ్యాపారులు, తోపుడుబండి వ్యాపారస్థులు, ఇంటి వద్ద వస్తువుల తయారీదారులు, చిరువ్యాపారులు, కల్లుగీత కార్మికులు, కళాకారులు, రిక్షా, బీడీ కార్మికులు, చెత్త ఎత్తేవారు), సేవా రంగంలో పనిచేసేవారు, ప్రభుత్వ పథకాలను అమలు చేసే పనివారు (ఎన్ఆర్ఈజీ వర్కర్లు, ఆశావర్కర్లు, ఎస్హెచ్జీ వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన వర్కర్లు, విద్యా వలంటీర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు), దుకాణాల్లో పనిచేసేవారు పథకానికి అర్హులు.
ప్రయోజనాలు ఇవీ..
కార్డు పొందిన వారికి ప్రమాద బీమా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించినా, శాశ్వత అంగవైకల్యాన్ని పొందినా రూ.2లక్షలు, పాక్షిక అంగవైకల్యాన్ని పొందినా రూ.లక్ష పరిహారాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందే వారూ ఈ-శ్రమ్ కార్డులు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు యథాతథంగా వారికి వర్తిస్తాయి.
1.40లక్షల మంది నమోదు
కార్మికశాఖ పరిధిలో జిల్లావ్యాప్తంగా 77,400 మంది గుర్తింపుకార్డులు పొంది ఉన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్లో వివిధ రంగాలవారు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రస్తుతం 1.40 లక్షల మంది ఈ-శ్రమ్ కార్డులు పొందారు. కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) ద్వారా ఇప్పటివరకు 99,500 మంది, వ్యక్తిగతంగా స్మార్ట్ఫోన్తో పాటు వివిధ మాధ్యమాల ద్వారా 41వేల మంది గుర్తింపు కార్డులు పొందారు. ఇప్పటివరకు కార్డు పొందని వారు www.eshram.gov.in లాగిన్ అయి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
విస్తృత ప్రచారం చేస్తున్నాం..
ఈ-శ్రమ్ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్లలోనూ గుర్తింపు కార్డులు పొందవచ్చు. ప్రభుత్వం కార్మికశాఖ ద్వారా అందించే పథకాలతో పాటు ఇది అదనంగా ఉపయోగపడుతుంది. అర్హులైన ప్రతిఒక్కరికీ కార్డులు అందుతాయి. స్మార్ట్ఫోన్స్ ఉన్న సొంతంగానూ దరఖాస్తు చేసజుకుని కార్డు పొందవచ్చు.
– షరీఫుద్దీన్, జిల్లా సహాయ కార్మికశాఖ కమిషనర్, కొత్తగూడెం