కారేపల్లి, ఏప్రిల్ 21 : నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బానోత్ మదన్లాల్ అధ్యక్షతన పార్టీ మండల ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలను కొనసాగించే పరిస్థితి కనబడడం లేదన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో సాగు, తాగు కష్టాలను చూస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే తపించేవారన్నారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరగిన పొరపాటును ప్రజలు కొద్దిరోజులకే తెలుసుకున్నారని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు పూర్వవైభవం రావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. సమావేశంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ శ్రీనివాసరావు, ఉన్నం వీరేందర్, హన్మకొండ రమేశ్, బత్తుల శ్రీనివాసరావు, మూడు జ్యోతి, షేక్ గౌసుద్దీన్, డొంకెన రవి, శంకర్, నామా సేవా సమితి సభ్యుడు తాళ్లూరి హరీశ్, సరిపూడి గోపి, పాల్వంచ రమేశ్, చీకటి రాంబాబు పాల్గొన్నారు.