ఖమ్మం వ్యవసాయం, జనవరి 30: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజారకం మిర్చి పంట ప్రభంజనం సృష్టించింది. సోమవారం ఉదయం జెండాపాట సమయానికే వివిధ జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 50 వేలకుపైగా బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం ఇంత పెద్ద మొత్తంలో పంట రావడం ఇదే తొలిసారి.
శని, ఆదివారాలు మార్కెట్కు సెలవుదినాలు కావడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం, మిర్చి పంటకు మంచి ధరలు పలుకుతుండడంతో రైతులు పెద్ద మొత్తంలో పంటను తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి నుంచి యార్డుకు పంట తాకిడి పెరిగింది. జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాకు రూ.18,700 పలికింది. మధ్యధర రూ.17,500 కాగా, కనిష్ఠ ధర రూ.12 వేల చొప్పున నిర్ణయించి ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు. తాలు రకం పంటకు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.9,600 పలికింది.