కూసుమంచి, ఫిబ్రవరి 20 : వేసవి కాలంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని జడ్పీ సీఈవో వినోద్ సంబంధిత అధికారులకు సూచించారు. కూసుమంచి మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కిందిస్థాయి అధికారులపై ఉందన్నారు. గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణ ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన వివిధ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేసవి వస్తున్నందున ఉపాధిహామీ పనులను కూలీలందరికీ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, ఎంపీవో రామచందర్రావు, సూపరింటెండెంట్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.