వేంసూరు, ఫిబ్రవరి 10: తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం, తాను జన్మించిన గడ్డ రుణం తీర్చుకుంటానని హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాల భవనానికి భూమిపూజ చేయడంతో తన కల ఈ రోజు సాకారమైందని అన్నారు. అమ్మ ఉన్నప్పుడే కళాశాల నిర్మించాలని అనుకున్నానని, ఇప్పుడు అమె లేకపోయినా ఆమె పేరుతో కళాశాల కట్టేందుకు నిర్మించేందుకు నాన్నతో కలిసి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి తన మాతృమూర్తి బండి సోమకాంతమ్మ జ్ఞాపకార్థం తాను పుట్టిన ఊరైన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో నూతనంగా చేపట్టిన జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి తన తండ్రి శ్రీనివాసరెడ్డితో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో పార్థసారథిరెడ్డి పునాది రాయి వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. కందుకూరులో జూనియర్ కళాశాల కట్టాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నానని, ప్రభుత్వానికి ఉన్న పరిమితుల కారణంగా అది సాధ్యపడలేదని, తానే స్వయంగా భూమిని కొనుగోలు చేసి కళాశాల కట్టేందుకు నిశ్చయించుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించి తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్తం కలిగి ఉండడం గొప్ప విషయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరిని మరువకూడదని అన్నారు ఇలాంటి దృఢసంకల్పంతో ఉన్న వ్యక్తి, ఈ ప్రాంత వాసి రాజ్యసభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అని పేర్కొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి సహాయ సహకారాలు అందించే వ్యక్తి, ఈ ప్రాంత శ్రీమంతుడు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించే వారని, దానిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కందుకూరులోని చెరువులన్నింటినీ బాగు చేసే క్రమంలో తనవంతు బాధ్యతగా నిధులు అందజేశారని గుర్తుచేశారు.
కందుకూరులోని శ్రీ షిర్డీ సాయిబాబా 27వ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయిబాబా పల్లకీని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, సర్పంచ్ బూరుగు నాగేశ్వరరావు, ఎంపీడీవో రమేశ్, ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 10: 2025లోగా టీబీ రహితంగా దేశాన్ని మార్చాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన ముక్త్ టీబీ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను దత్తత తీసుకొని తన సొంత ఖర్చుతో టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి తెలిపారు. కందుకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని టీబీ పేషెంట్లకు శనివారం సత్తుపల్లిలోని లక్ష్మీప్రసన్న హాల్లో ఈ కిట్ల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రూ.1.50 కోట్లతో ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ వరకు టీబీ రోగులకు వారి ఇళ్లకు వెళ్లి న్యూట్రిషన్ కిట్లు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.