ఖమ్మం, డిసెంబర్8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ర్టాలను కలపాలని దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్కుమార్, సజ్జల రామకృష్ణారెడ్డిపై టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. గురువారం ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆటలో ఆంధ్రప్రదేశ్ నాయకులు కీలుబొమ్మలుగా మారొద్దని హితవుపలికారు. విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగుతున్నాయన్నారు. తెలంగాణపై బీజేపీ కుట్రలో భాగంగా కొందరు నాయకులు ప్రజల్లో ఆందోళన కలిగించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
విభజన చట్టంలోని హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ర్టానికి లాభం చేకూర్చే విధంగా దోహదపడాలన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల కోసం కేంద్రంపై పోరాటానికి తెలంగాణ బిడ్డలు సైతం అండగా ఉంటారన్నారు. రాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీకి ఆలయ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించే దమ్ము ఉందా..? అన్ని ప్రశ్నించారు. అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో విద్యుత్ 24 గంటలు అందించడం లేదని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ గుజరాతి వ్యామోహంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్న కరెంటు తీగలను పట్టుకునే ధైర్యం బండి సంజయ్కి ఉంటే తెలంగాణలోని విద్యుత్ సరఫరా ఉందో లేదో తెలుస్తుందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, తెలంగాణ ఉద్యమకారుడు శేషు పాల్గొన్నారు.