బోనకల్లు, మార్చి 27 : యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా పట్టించుకోరా.. అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రశ్నించారు. బుధవారం బోనకల్లు, ఆళ్లపాడు గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను జడ్పీ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నారని, తీరా పంట చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు.
బోనకల్లు మండలంలో ఏడాది క్రితం ఎండిపోయిన పంట పొలాలను అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి పరిహారం అందజేశారని గుర్తు చేశారు. కనీసం డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో రైతుల కష్టాలను పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధను గుర్తించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, రైతు నాయకులు వేమూరి ప్రసాద్, జంగ రవి, పార ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు, యార్లగడ్డ నర్సింహ, మోర్ల నర్సింహారావు, వల్లెబోయిన కొండలరావు, మోదుగుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.