అశ్వాపురం, జూన్ 24: గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్, తరగతి, వసతి గదులు, వంటశాల, పాఠశాల ఆవరణను కలియతిరుగుతూ పరిశీలించారు. ల్యాబ్లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో నిండిపోయి ఉండటాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే అంశంపై సూచనలు చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై మండిపడ్డారు. దీనిపై సీటీవోతో ఫోన్లో మాట్లాడి.. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం హెచ్ఎం గది, వంటశాలను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం వడ్డించడం లేదంటూ వార్డెన్ను వివరణ కోరారు. అనంతరం కొత్తూరు ఎంపీపీఎస్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఎలకలగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే విధానం, దరఖాస్తుల పరిశీలన, యాప్ ద్వారా వివరాల నమోదు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇండ్ల సర్వే పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.