భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ప్రారంభమైన మరో రెండు గ్యారెంటీలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్బండపై వినియోగదారుల్లో అయోమయం నెలకొన్నది. కేవైసీ కోసం తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఆఫీస్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, ఎప్పటిలాగే రూ.1000కే గ్యాస్బండ కొనుగోలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 200 యూనిట్లలోపే కరెంట్ వాడుకున్న వారికి బిల్లులు వస్తుండడంతో ఆశ్చర్యపోతున్నారు. గ్రామసభల్లో దరఖాస్తున్న చేసుకున్న తెల్ల రేషన్కార్డు, ఆధార్కార్డు ఉన్నవారికి సైతం కరెంటు బిల్లులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2,82,439 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా.. తెల్ల రేషన్కార్డులు ఉన్నవారు 2,93,300 మంది ఉన్నారు. రేషన్కార్డు లేనివారు తమకు కార్డులేదని బాధపడుతుంటే.. కార్డు ఉండి కూడా తమకు ప్రయాజనం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు మాటలకే పరిమితమై ఆచరణకు సాధ్యం కావడం లేదని ఆరోపిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. కానీ.. అందులో తప్పులు దొర్లడంతో మళ్లీ గ్రామాల్లో రీ సర్వే చేశారు. అయినా తెల్లకార్డులు ఉన్నవారికి కూడా జీరో బిల్లు రాలేదు. దీంతోపాటు మరో కొత్త పథకం ఇందిరమ్మ ఇల్లు కూడా సోమవారం అమలు చేశారు. దాని పరిస్థితి కూడా అంతేనేమో అనిపిస్తున్నది. తెల్ల రేషన్కార్డును పరిగణనలోకి తీసుకోవడమే ఈ గందరగోళానికి కారణంగా లబ్ధిదారులు అంటున్నారు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చినట్లే కార్డు ప్రామాణికం లేకుండా ఇస్తే పథకాలు అమలు జరుగుతాయని చెబుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పథకాలు అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు.
కూలి చేసుకునే కుటుంబం మాది. మాకు రేషన్కార్డు ఉన్నా కరెంటు బిల్లు వచ్చింది. ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు పెట్టుకున్నాం. మళ్లీ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమంటే అక్కడ కూడా దరఖాస్తు ఇచ్చాను. బిల్లు కట్టాలా.. వద్దా.. కూడా తెలియడం లేదు. బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. కూలి పనులకు పోయే మేము ఆఫీసుల చుట్టూ తిరగలేం.
తెల్ల రేషన్కార్డు లేదు. దరఖాస్తు పెట్టాం. కార్డు రాకుండానే సర్వే చేశారు. కరెంటు వాళ్లు వచ్చారు.. రాసుకున్నారు. మాకు ఉచిత కరెంటు రాదంట. గ్యాస్ కూడా రాదు. కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారో.. ఇచ్చినా దానికి ఎన్ని కొర్రీలు పెడతారో. పథకాలు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. మాలాంటి పేద కుటుంబాలకు ఇన్ని నిబంధనలు పెడితే ఎలా?
ప్రభుత్వం లాంఛనంగా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే అర్హులందరికీ జీరో బిల్లులు ఇచ్చాం. కొన్నిచోట్ల ఆన్లైన్లో ఫోన్ నెంబర్ లేదా బిల్లు నెంబర్ మ్యాచ్ కాకపోవడంతో బిల్లు వచ్చింది.. వీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిల్లు చెల్లించవద్దు. మళ్లీ ఆన్లైన్లో సరిచేస్తారు. ఎంపీడీవో కార్యాలయాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశాం.. అక్కడకు వెళ్లి సరిచేయించుకోవాలి.