భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం చేయవద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ శాఖల్లో ఉన్న పెండింగ్ పనుల గురించి ఆయా శాఖల అధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంజూరు చేసిన పనులను అటవీశాఖ అధికారులు ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో గిరివికాసం పథకం కింద మంజూరైన పనులకు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. తాగునీటి సమస్య కూడా లేకుండా చూడాలన్నారు.
మారుమూల ప్రాంతాల్లోని మొబైళ్లకు టెలికం సేవలు అందాలన్నారు. ఇందుకోసం సెల్ టవర్ల నిర్మాణానికి భూమిని ఇప్పించాలన్నారు. ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పనుల అవసరాల కోసం అటవీ భూములకు అనుమతుల కోసం జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అవసరమని అన్నారు. అందుకని ఆయా పనుల ప్రతిపాదనలను ఐటీడీఏకు పంపాలని సూచించారు. పోడు పట్టాలున్న గిరిజన రైతులు సాగుచేస్తున్న పామాయిల్ తోటలకు, బోరుబావులకు అవసరమని అన్నారు. వాటికి విద్యుత్ సౌకర్యం అవసరమైనందున వాటి ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదనరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు కిష్టాగౌడ్, భీమ్లా, అభిమన్యుడు, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.