భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పరీక్ష ఫలితాలు విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో అధికారికంగా వెలువడిన ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 240 మందిని ఎంపిక చేశారు. వారికి అక్కడే నియామక పత్రాలను అందజేయగా.. స్థానిక డీఎంహెచ్వో డాక్టర్ శిరీష జిల్లా కార్యాలయంలో ఐడీ కార్డులను వారికి అందజేశారు.
కొత్తగా ఏర్పాటైన జిల్లాలో గతంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ఉండేది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో ఏజెన్సీ ప్రాంతానికి తొలిసారిగా మెడికల్ కాలేజీ మంజూరుతోపాటు నర్సింగ్ కళాశాల కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏరియా ఆస్పత్రి జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయ్యింది. దీనికి అనుసంధానంగా వంద పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి బీజం పడింది. అయితే ఇందులో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా రావడంతోపాటు పోస్టుల భర్తీకి రాత పరీక్ష కూడా నిర్వహించారు. వాటి ఫలితాలు వెలువడడంతో జిల్లాలో ప్రస్తుతం 240 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ కానున్నాయి. మరో వారం రోజుల్లో కౌన్సిలింగ్ పూర్తి కాగానే కొత్తగా ఆర్డర్లు తీసుకున్న స్టాఫ్ నర్స్లు జిల్లా ఏరియా, జనరల్ ఆస్పత్రిలో విధుల్లో చేరనున్నారు.