ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 13: ‘అందరూ చదవాలి.. అందరూ రాయాలి..’ అనే నినాదంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యాశాఖ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకు అవసరమయ్యే బడ్జెట్లో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరిస్తాయి. పథకంలో వలంటీర్లుగా బీఈడీ చదువుతున్న విద్యార్థులు వ్యవహరిస్తారు.
పథకాన్ని పర్యవేక్షించేందుకు ఇప్పటికే వయోజన విద్యాశాఖ జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించింది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాకు డీడీ వర్మ, భద్రాద్రి జిల్లాకు అనిల్ను ఎంపిక చేసింది. వీరు బీఈడీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులను వలంటీర్లుగా ఎంపిక చేస్తారు. ఒక్కో వలంటీర్ పదిమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పథకం అమలుకు ప్రత్యేకంగా ‘ఉల్లాస్’ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్లో వలంటీర్లు, నిరక్షరాస్యులు, పాఠశాలల వివరాలు అందుబాటులో ఉంటాయి.
పథకం అమలుకు ఇప్పటికే అధికారులు జిల్లాల వారీగా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు జమ అవుతాయి. పథకానికి మెంబర్ సెక్రటరీగా డీఈవో, చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. అధికారులు ఇప్పటికే ఖమ్మం జిల్లావ్యాప్తంగా 1,77,392 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారు. వీరిలో 33,693 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,55,890 మంది నిరక్షరాస్యులు ఉండగా, వీరిలో 2,5518 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. పథకం అమలుపై ఈ నెలాఖరులో కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయని భద్రాద్రి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ అనిల్ తెలిపారు.