దశాబ్దాలు గడిచినా దశ తిరగలేదు. పోడు భూమిని నమ్ముకున్నా పట్టా కాగితం చేతికందలేదు. తాత ముత్తాతల నుంచి పోడుతోనే బతుకులీడుస్తున్నా.. ఎవరొచ్చి నోటికాడి కూడు లాక్కుంటారోనని.. పెద్ద సార్లొచ్చి లాఠీలకు పని చెబుతారోనని భయం భయంగా బతుకులు వెళ్లదీశారు. పట్టాల కోసం గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా.. హక్కు పత్రాలు చేతికందలేదు కదా.. కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. ఆదివాసీలు, గిరిజనులు అడవుల్లో పోడు భూముల్లో పడుతున్న కష్టాలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వారిని హక్కుదారులను చేయాలని సంకల్పించింది. పట్టాలిచ్చి పండుగ చేసుకునేలా చేసింది. పట్టాలతోనే సరిపెట్టకుండా రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని చెప్పి ఇచ్చిన మాటను నెలబెట్టుకున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టాలు అందుకోనున్న పోడుదారుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
ఖమ్మం, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సర్కారు మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని సంస్కరణలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో చరిత్రకు నాంది పలికింది. ఏళ్ల తరబడి అడవినే నమ్ముకున్న ఆదివాసీ, గిరిజన బిడ్డలను ‘పట్టా’భిషిక్తులను చేస్తోంది. ఏళ్లకేళ్లుగా వారు గోసపడిన చోటే.. మరికొద్ది గంటల్లోనే వారికి అపూర్వ గౌరవాన్ని అందించనుంది. వారు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే గొప్పకార్యాన్ని నిర్వహించబోతుంది.
తాత ముత్తాతల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు ఎలాంటి హక్కు పత్రాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ అధికారి వచ్చి పండిన పంటను, నోటికాడి కూడును లాక్కుంటానన్న ఆందోళన. బుక్కెడన్నం పెడుతున్న భూమికి హకు పత్రాలు లేక దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వారి ఆందోళనకు శాశ్వత పరిష్కారం చూపుతూ, వారి కలలను సారం చేస్తూ పోడు పట్టాలను పంపిణీ చేయనుంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయనున్నది.
ఈ మేరకు ఖమ్మం జిల్లాలో 13,139 ఎకరాలు సాగుచేసుకుంటున్న 6,589 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఈ పట్టాలను పంపిణీ చేయనున్నారు. సమైక్య పాలనలో పోడు పట్టాలు లేక అరిగోస పడిన ఆదివాసీలు శుక్రవారం పట్టాలు అందుకోనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భయంభయంగా గడిపిన చోటే ఇప్పటి నుంచి దర్జాగా బతుకుతామంటూ సంబురపడుతున్నారు. తమకు బతుకుదెరువు కల్పించిన సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ చేతులు జోడిస్తున్నారు.
నాడు లాఠీ దెబ్బలు.. నేడు చేతికి పట్టాలు..
బుక్కెడు బువ్వ కోసం పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టించారు నాటి సమైక్య పాలకులు. కాళ్లతోనూ తన్నించారు. చేతికొచ్చిన పంట ఇంటికి రాకుండా కందకాలు తవ్వారు. అడవిని నరికారంటూ కేసులు పెట్టారు. ఇంకా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు. కానీ, తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. అధ్యయనానికి సబ్ కమిటీ వేశారు. మూడంచెల సర్వే నిర్వహించారు. వాస్తవ స్థితిగతుల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించారు. జీవో 140 ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సమైక్య పాలనలో 2008 నుంచి 2012 వరకు అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 24 వేల మందికి మాత్రమే పట్టాలు మాత్రమే ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 57,184 మందికి పట్టాలు అందించనుండడమే గాక రైతుబంధు, రైతుబీమా పథకాలనూ అమలు చేయనుంది.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లోని 106 శివారు గ్రామాల్లో 6,589 మంది రైతులు సాగుచేసుకుంటున్న 13,139 ఎకరాల భూమికి అధికారులు శుక్రవారం పట్టాలు పంపిణీ చేయనున్నారు. మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.
నేడు పంపిణీ చేయనున్న మంత్రులు..
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం భద్రాద్రి జిల్లా పాల్వంచలోని సుగుణ ఫంక్షన్ హాల్లో ఉదయం 11:35 గంటలకు గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్లో పసంగిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలోనూ ఖమ్మం జిల్లా గిరిజన రైతులకు పోడు భూముల హక్కు పత్రాలు అందజేస్తారు.
మాట తప్పని సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా పోడు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. పట్టాల గురించి గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా మాకు పట్టాలు రాలేదు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ మాటలను పటాపంచలు చేస్తూ పోటు పట్టాలతోపాటు రైతుబంధు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో వారి నోళ్లు మూతపడ్డాయి. ఏళ్ల నాటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది.
-భూక్య అచ్చయ్య, పోడు రైతు, కెప్టెన్ బంజర, కామేపల్లి మండలం
జీవితానికి ఇదే పెద్ద వరం..
ఎన్నో ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు రావడమే మా జీవితాలకు గొప్ప వరం.. ముఖ్యమంత్రి కేసీఆరే వచ్చి దేవుడిలా మాకు వరమిచ్చిట్లుగా అనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల సమస్య ఇది. మా ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ వాటిని శాశ్వతంగా తొలగిస్తూ మాకు పట్టాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రావడం వల్లే మాకు పట్టాలు వస్తున్నాయి. పట్టాలు తీసుకున్నాక మా గూడెంలో పండుగ చేసుకుంటాం.
-శర్పా రమేశ్, మద్రాస్ తండా, టేకులపల్లి మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
గత పాలకులు పోడు రైతులకు పట్టాలు ఇస్తామని మాయమాటలు చెప్పారే తప్ప పట్టించుకునే వారే లేరు. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇవ్వరని చెప్పడంతో ఆ మాటలు నిజమేనని నమ్మాం. సీఎం కేసీఆర్ ముందుగా పట్టాలు ఇస్తానని చెప్పిన విధంగా ఇప్పుడు పంపిణీ చేయడం బాగుంది. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సర్వే చేసి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు పోడు రైతులు రుణపడి ఉంటారు.
-బాదావత్ మంగమ్మ, శ్రీరాంనగర్తండా, కామేపల్లి మండలం