పెనుబల్లి, సెప్టెంబర్19: 60 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్కు ఇప్పుడు చెబుతున్న ఆరు సూత్రాలు ఎందుకు గుర్తుకు రాలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకులు వనరులను దోచుకోవడం తప్ప ప్రజలకు, రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కరెంటు కోతలు, ఎరువుల కొరతలతో రైతులను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు గ్యారెంటీ హామీలంటూ మాయమాటలు చెబుతోందని దుయ్యబట్టారు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులను అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. పెనుబల్లి డీసీసీబీ బ్యాంకు పరిధిలో కల్లూరు మండలం కొర్లగూడెం సొసైటీలోని 100 మంది రైతులకు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి రూ.70 లక్షల రైతు రుణమాఫీ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. దశల వారీగా రుణమాఫీ జరుగుతోందని అన్నారు.
కాంగ్రెస్వన్నీ మోసపు హామీలే..
ఆరు సూత్రాలంటూ కరపత్రాలు పట్టుకొని కాంగ్రెస్ చెబుతున్నవన్నీ మాయమాటలేనని ఎమ్మెల్యే సండ్ర ధ్వజమెత్తారు. ఇలాంటి మోసపూరిత హామీలతో ఇటీవల కర్ణాటకలో గెలిచినప్పటికీ వాటిని అమలు చేయడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇలాంటి హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. అయితే ఖమ్మం డీసీసీబీ అతి తక్కువ సమయంలో రూ.3 వేల కోట్ల టర్నోవర్ చేసి రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. తక్కువ సమయంలో బ్యాంకును అభివృద్ధి చేసిన చైర్మన్ కూరాకుల నాగభూషణంకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వరరెడ్డి, మేనేజర్ కృష్ణలను ఎమ్మెల్యే సండ్ర సత్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, జనార్దన్, తేజావత్ తావునాయక్, కనగాల వెంకట్రావు, భూక్యా ప్రసాద్, చింతనిప్పు సత్యనారాయణ పాల్గొన్నారు.