సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 24 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకుని మండలంలోని రామానగరంలో బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను రామానగరంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందన్నారు. ఇప్పటికే రైతుబీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తుండగా ఇకనుంచి తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా అందిస్తానని ప్రకటించారన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, రైతుబంధు రూ.16వేలు, ఆసరా పింఛన్లు పెంపు వంటి వినూత్న పథకాలు ప్రకటించారని, బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పథకాలన్నీ అమలుచేసే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వారి పరిపాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడంలేదంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కర్నాటకలో విద్యుత్ సరఫరా లేక రైతులు రోడ్డెక్కుతున్నారని ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలన్నారు. అలవకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు. దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, సర్పంచ్ వేల్పుల కళావతి, మోటపోతుల వెంకటేశ్వరరావు, మందపాటి చెన్నారెడ్డి, రవి, మోటపోతుల పుష్ప, దొడ్డా శంకర్రావు పాల్గొన్నారు.