సత్తుపల్లి, మార్చి 31 : మంండలంలోని బుగ్గపాడు పంచాయతీ పరిధిలో గల చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో ఆదివారం గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. బుగ్గపాడు రెవెన్యూ పరిధిలోని చంద్రాయపాలెంలో గతంలో గిరిజనులకు పోడుపట్టాలు ఇవ్వడంతో అప్పటినుంచి చంద్రాయపాలెం గిరిజనులు ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. అయితే శనివారం ఆ భూమిలో బుగ్గపాడు తదితర ప్రాంతాల గిరిజనులు వెళ్లి భూమిని చదును చేస్తుండడంతో చంద్రాయపాలెం గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. 30ఎకరాల్లో ఉన్న ఆ భూమి తమదంటే తమదని గొడవకు దిగారు. దీంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కిరణ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను విడదీసే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా బుగ్గపాడుకు చెందిన గిరిజనులు పెద్దఎత్తున పోలీసులపై దాడిచేసి తీవ్రంగా కొట్టడంతో సీఐ కిరణ్తో సహా మరో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అప్పటికే 300మందికి పైగా గిరిజనులు చుట్టుముట్టి పోలీసులపై దౌర్జన్యానికి దిగడంతో వెనక్కుతిరిగి వచ్చిన పోలీసులు ఏసీపీ అనిశెట్టి రఘు ఆధ్వర్యంలో సబ్డివిజన్లోని పోలీసులతో కలిసి చంద్రాయపాలెం వెళ్లి దౌర్జన్యానికి దిగిన 30 మందికి పైగా గిరిజనులను గుర్తించి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఏసీపీ అనిశెట్టి రఘు, ఎఫ్డీవో మంజుల, ఎఫ్ఆర్వో స్నేహలతలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
చంద్రాయపాలెం అటవీపరిధిలో ఎన్నో ఏళ్లుగా ఈ భూమి పంచాయతీ వివాదం తలెత్తుతూనే ఉంది. 400 ఎకరాలు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో పట్టాలిచ్చారంటూ గిరిజనులు పేర్కొంటుంటగా దానిలో 30 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. అప్పటినుంచి చంద్రాయపాలెం, బుగ్గపాడు గ్రామాల గిరిజనుల మధ్య ఈ భూమికి సంబంధించి వాగ్వాదం చోటుచేసుకుంటూనే ఉంది. శనివారం ఇరు గ్రామాలకు చెందిన గిరిజనులు స్టేషన్కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా వారంరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఐ కిరణ్ హామీ ఇచ్చి పంపించినప్పటికీ తిరిగి ఆదివారం పెద్దఎత్తున ఆ గ్రామాల గిరిజనుల మధ్య గొడవ జరిగి చివరకు పోలీసులపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారు.