పాల్వంచ, మార్చి 29 : ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు బండి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో కాంట్రాక్టు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందన్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ప్రతి నెల వేతనాలు వచ్చేలా చూడాలన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోతే సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆస్పత్రి అధికారులకు నోటీసు అందజేశారు. అనంతరం వైద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా సహాయ కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పద్మజ, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, పాషా, రామకృష్ణ, కనకదుర్గ, అజయ్, నాగలక్ష్మి, పద్మ, స్వరూప, జ్యోతి, రాము, దినేష్, గోపాల్, రామకృష్ణ, సుజాత, రుక్మిణి, హుస్సేన్, సత్యవతి, హేమంత్, కృష్ణ పాల్గొన్నారు.