అవకాశంభద్రాచలం, అక్టోబర్ 16: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు సోమవారం లక్ష్మీతాయారమ్మ భక్తులకు సంతానలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం అమ్మవారికి పంచామృతాలు, తొమ్మిది రకాల పండ్ల రసాలు, నారికేళ జలాలతో అభిషేకం, అష్టోత్తర శతనామార్చన చేశారు. చిత్రకూట మండపంలో సంక్షేప రామాయణ హోమం చేపట్టారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి తాము కోరుకున్న అవతారంలో గోత్ర, నామాలతో అర్చన చేయించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అందుకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శాశ్వత ఉభయత్వానికి రూ.10 వేలు చెల్లించి రశీదు పొందాలని కోరారు. కాగా మంగళవారం లక్ష్మీతాయారమ్మ వారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.