కల్లూరు, జూలై 9 : రెవెన్యూ డివిజన్గా ఉన్న కల్లూరు ప్రజావసరాలకు అనుగుణంగా రోజురోజుకూ ప్రగతిపథం లో ముందుకు దూసుకుపోతున్నది. కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధితో కల్లూరు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ప్రజల అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంతో ఆరు పడకలకు పరిమితమైన ప్రభుత్వాసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేసుకుని 50 పడకలుగా మార్చారు. ఆసుపత్రి భవనానికి రూ.10.50 కోట్లు మంజూరు చేయించి దానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీశ్రావుచే శంకుస్థాపన చేయించారు.
కల్లూరుకు నూతన బస్టాండ్…: రెవెన్యూ డివిజన్గా పేరున్న కల్లూరుకు బస్టాండ్ లేదు. స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సండ్ర దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నూతన బస్టాండ్ను ఏర్పాటు చేశారు. రూ.80 లక్షలతో నూతన సొసైటీ భవనం : కల్లూరులో సొసైటీ కార్యాలయం 60 ఏళ్లుగా అద్దెభవనంలో కొనసాగుతోంది. అద్దె భవనంలో పడుతున్న ఇబ్బందులను సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణరావు ఎమ్మెల్యే సండ్ర దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే కల్లూరులోని కప్పలబంధం రోడ్ వద్ద ప్రభుత్వ స్థలాన్ని అధికారుల ద్వారా సేకరించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు నిధులు రూ.68 లక్షలు, కార్ఫస్ ఫండ్ రూ.12 లక్షలు మొత్తం రూ.80 లక్షలతో నూతనంగా సొసైటీ భవనాన్ని నిర్మించి అక్కడ 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణాలు చేపట్టారు. ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయం సత్తుపల్లికి మంజూరు కాగా రైతులకు ఉపయోగపడేలా కల్లూరుకు కార్యాలయాన్ని బదిలీ చేయించి రూ.1.98 కోట్లతో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ముందుకొచ్చారు.
క్రీడాకారులకు వరం…మినీ స్టేడియం…
మండల కేంద్రంలో క్రీడాకారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎమ్మెల్యే సండ్ర ప్రత్యేక దృష్టి సారించి రూ.3.50 కోట్లు నిధులు మంజూరు చేయించారు. గత నెలలో రాష్ట్ర క్రీడలశాఖామంత్రి శ్రీనివాస్గౌడ్చే ఈ స్టేడియాన్ని ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ స్టేడియంలో ఇండోర్, అవుట్డోర్ స్టేడియం, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, జిమ్, వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యాలు కల్పించారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి
కల్లూరు మండల కేంద్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇప్పటికే పట్టణంలో మినీస్టేడియం, బస్టాండ్, నూతన ఆసుపత్రి, ఇరిగేషన్ కార్యాలయం, సొసైటీ భవనం నిర్మించాం. మున్ముందు కల్లూరులో సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి పట్టణాన్ని మరింత ఆధునీకరిస్తాం. పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం..
– ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి
ఎమ్మెల్యే సండ్ర కృషితో అభివృద్ధి
నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో అన్నిరంగాల్లో కల్లూరు అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారు.
– బోబోలు లక్ష్మణరావు, డీసీసీబీ డైరెక్టర్, సొసైటీ చైర్మన్, కల్లూరు