రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దినాదినాభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికతో ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుదుతున్నది. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి రోజురోజుకూ విస్తరిస్తున్నది. నగరానికి శివారుగా రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి కార్యాచరణ, ఎడ్యుకేషనల్, హెల్త్, టెంపుల్స్, టూరిజం హబ్గా అవతరించడంతో సుడా పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే నగర నడిబొడ్డున, నగరం చుట్టూ సుడాతోపాటు పలు ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన వెంచర్లు విజయవంతమయ్యాయి. నగర నడిబొడ్డు వరకు మాత్రమే విస్తరించిన మార్కెట్ వ్యవస్థ ఇప్పుడు శివారు గ్రామాలకు పరుగులు పెడుతున్నది.
-ఖమ్మం, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి)
ఖమ్మం, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నది. ప్రత్యేక విజన్తో డ్రాఫ్ట్ మాస్ట్టర్ ప్లాన్ను రూపొందించి అమలు చేస్తున్నది. మాస్టర్ప్లాన్లో నగరం చుట్టూ కమర్షియల్ జోన్లు నిర్ణయించారు. భవిష్యత్లో జరగబోయే అభివృద్ధిని ఊహించి అధికార యంత్రాంగం డీఆర్ఆర్ చుట్టూ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ పార్క్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు మాత్రమే సుడా మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. నగర నడిబొడ్డు వరకు మాత్రమే విస్తరించిన మార్కెట్ వ్యవస్థ ఇప్పుడు శివారు గ్రామాలకు పరుగులు పెడుతున్నది. అభివృద్ది అంటూ ఖమ్మం పేరు వినిపించేలా నగరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
రియల్ ఎస్టేట్తో మారిన ఖమ్మం
ఖమ్మం జిల్లా రియల్ రంగానికి పెట్టింది పేరుగా నిలుస్తోంది. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా భూములకు ధరలున్న ప్రాంతం ఖమ్మం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో రియల్ జోరు నడుస్తోంది. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలసిన వెంచర్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. శ్రీబాలాజీ రియల్ ఎస్టేట్స్, శ్రీసిటీ, శ్రీనిధి, అమెరికన్ టౌన్షిప్, ఖమ్మం హెరిటేజ్, జయవిలాసిని డెవలపర్స్ వంటి సంస్థలు చేస్తున్న వెంచర్లు సక్సెస్ సాధిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సంస్థలే కాకుండా హైదరాబాద్ ప్రాతానికి చెందిన పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఖమ్మంలో వెంచర్లు వేసేందుకు ముందుకొస్తున్నాయి.
జాతీయ రహదారుల అనుసంధానంతో రియల్ బూమ్
నగరానికి ఆనుకొని రెండు జాతీయ రహదారుల నిర్మాణం జరుగనున్నది. అమరావతి -నాగ్పూర్, దేవరపల్లి జాతీయ రహదారులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలై ల్యాండ్ ఎక్విడేషన్ పూర్తికావడంతో రియల్ వ్యాపారం జోరందుకున్నది. ఆయా పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఖమ్మం నగరానికి చుట్టూ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు చేస్తుండటంతో రింగ్రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో రియల్ఎస్టేట్ పుంజుకుంటోంది. ఇప్పటికే నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలసిన వెంచర్లలో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీనికితోడు ఎడ్యుకేషన్, హెల్త్, టెంపుల్, టూరిజం, ఐటీహబ్గా మారుతున్న ఖమ్మం నగరం రియల్ వ్యాపారానికి కలిసి వస్తోంది.
ఖమ్మం నగరంలో రియల్ వ్యాపారానికి భారీగానే డిమాండ్ ఉన్నది. నగర శివారుతోపాటు సుడా పరిధిలోని గ్రామాల్లోని వెంచర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఖమ్మం నగర శివారు వైరా రోడ్డులో నూతనంగా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రఘునాథపాలెం నూతన మండలంగా ఏర్పాటై అభివృద్ధిపథంలో దూసుకెళ్తుండటంతోపాటు ప్రధాన కార్యాలయాల ఏర్పాటు కావడంతో ఇల్లెందు రోడ్డులోనూ భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. జిల్లా కేంద్రంలోని నలుమూలలా రేట్లు పెరిగిపోయాయి.
కుటుంబానికి ఇల్లే ఆశల సౌధం.. అనందాలు పంచుకునే పొదరిల్లు.. అనుబంధాలకు నెలవైన హరివిల్లు.. అలాంటి కట్టడాన్ని తమ తరానికే కాక తమ తర్వాతి తరాల వారికీ అందివ్వాలనే తలంపుతో కూసుమంచికి చెందిన పాపయ్య అనే వ్యక్తి 150 ఏళ్ల క్రితమే అందమైన భవనాన్ని నిర్మించారు. అదే చతుర్శాల భవంతి. వంశపారపర్యంగా ఇప్పుడు నాలుగోతరం వారసులు ఇప్పుడు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు.
ముత్తాతల కలల కట్టడాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మునిమనుమలు. ఆ ఇల్లు బాగు చేయించే ఖర్చుతో కొత్తగా మూడు ఇండ్లు నిర్మిచుకోవచ్చు. కానీ ఇప్పటికీ ఆ ఇంటిని అపురూపంగా చూసుకుంటున్నది నేటి తరం. ప్రస్తుతం నాలుగో తరమైన జానకీదేవి, పద్మసీత అనే ఇద్దరు వారసులు ఇంట్లో నివసిస్తున్నారు. వారి కుమారులు, కుమార్తెలు లక్ష్మీనర్సింహారావు, కల్యాణ్, కార్తీక్, అనూరాధ, అపర్ణ, సీత హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. కానీ పండుగలు పబ్బాలకు మా త్రం పిల్లాపాపలతో కూసుమంచికి వచ్చేస్తారు. ము ఖ్యంగా బతుకమ్మ వేడుకల సమయంలో ఇల్లు కుటుంబ సభ్యులతో కళకళలాడుతుంది.
కట్టడం విశేషాలివీ..
ఇంటికి వినియోగించిన కలప అంతా టేకు చెక్కలే. ఇంటి ప్రధాన ద్వారానికి నాటి వడ్రంగులు నగిషీలు చెక్కారు. అప్పటికి సిమెంట్ లేదు. నాటి తాపీ కార్మికులు ఇంటి గోడలను ఎద్దులతో తొక్కించిన గానుగ సున్నం, డంగుతో నిర్మించారు. ఇంట్లో మొత్తం ఎనిమిది పడక గదులు, హాలు, కిచెన్, అతిథ్య గదులు, సెల్లార్, పూజ గది, స్టోర్ రూంలు ఉన్నాయి. ధాన్యం భద్రపరిచేందుకు గరిశలు, వంద పశువులను పోషించేందుకు నాలుగు కొష్టాలు, గూన పెంకుతో పశువుల పాకలు నిర్మించారు.
ఒకరకంగా చెప్పాలంటే 150 ఏళ్ల క్రితం ఈ కట్టడం డూప్లెక్స్. పైకప్పుపై కురిసిన వర్షపు నీరు నాలుగు వైపుల నుంచి భూమిలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ 3 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తుతో పటిష్టమైన ప్రహరీ నిర్మించారు. ఇంటికి మొత్తం ఆరు గుమ్మాలు ఉంటాయి. కొన్నేళ్ల క్రితం కోతులు గూన పెంకు పైకప్పును ధ్వంసం చేయడంతో కుటుంబ సభ్యులు అక్కడ బెంగళూరు పెంకు వేయించారు. సుమారు 10 ఎకరాల్లోని విశాలమైన ప్రాంగణంలో ఎకరా వైశాల్యంలో రూపుదిద్దుకున్న ఈ ఇల్లు ఇప్పటికి రాజసానికి ప్రతీకగా నిలుస్తున్నది.
సమస్యల పరిష్కార వేదిక..
కూసుమంచి గ్రామానికి రంగారావు తండ్రి నర్సయ్య, తరువాత రంగారావు పట్వారీగా ఉన్నారు. నాడు పోలీస్ స్టేషన్, కోర్టుల అవసరమే ప్రజలకు ఉండేది కాదు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కేశరాజు కుటుంబమే కీలకమే వ్యవహరించేది. అందుకు చతుర్శాల భవంతి వేదికగా నిలిచేది. ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ హోదాల్లో పని చేసే ఉన్నతాధికారులు ఆ ఇంటికి వచ్చి ఆతిథ్యం పొందేవారు. నాడు ఇంట్లో పనిచేయడానికి పనివాళ్లు, గుమస్తాలు, వంట మనుషులు కలిపి 10 మంది పరివారం ఉండేది. భవంతిలో నివసించే వారి కోసమే ప్రత్యేకంగా రజకులు, క్షురకులు ఉండేవారు.
కలెక్టర్ వచ్చినంకనే డీటీసీపీ లే అవుట్పై అవగాహన వచ్చింది
ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంది. కలెక్టర్ వీపీ గౌతమ్ సహకారంతో ముందుకెళ్తున్నాం. డీటీసీపీ లే అవుట్ల విషయంలో కలెక్టర్ వ్యాపారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో అన్ని జిల్లాల్లో కంటే ఖమ్మం కలెక్టర్ సహకారం చాలా బాగుంది. తనికెళ్ల వద్ద బటర్ ఫ్లై సిటీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్ అన్ని రకాల అనుమతులు పొందింది. కూసుమంచిలో జయభేరి గ్రీన్సిటీ వెంచర్ పేరుతో ప్రపోజ్డ్ లే అవుట్ పొంది పర్మిషన్స్కు వెళ్తున్నాం. శ్రీనిధి, బటర్ ఫ్లై సిటీ వెంచర్లు కొనుగోలుదారుల నమ్మకానికి అనుగుణంగా వ్యాపారం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
-ఉన్నం జగన్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిధి ఎన్క్లేవ్
కస్టమర్ల ఆలోచనలకు అనుగుణంగా వ్యాపారం
కస్టమర్ల ఆలోచనలకు అనుగుణంగా వెంచర్లను ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలు చేపడుతున్నాం. వెంచర్లలో కొనుగోలు చేసినవారికి భవిష్యత్లో ఆ ప్లాటుపై ఊహించనంత రాబడి వచ్చేలా వెంచర్ల ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారి ప్లాటు కొనుగోలు చేసిన కస్టమర్లు మళ్లీ మేం కొత్తగా చేసే వెంచర్లలో కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
-కుంచెపు రాంబాబు, జయవిలాసిని డెవలపర్స్ అధినేత
రియల్ ఎస్టేట్కు మంచి ఆదరణ
హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేట్కు ప్రసిద్ధిచెందిన ఖమ్మంలో రియల్ వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తోంది. నగరానికి చుట్టు పక్కల జాతీయ రహదారుల ఏర్పాటుతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన ప్రాంతంగా రియల్టర్లు భావిస్తున్నారు. సుడా ప్రత్యేక కార్యాచరణ చేస్తూ డ్రాఫ్ట్ మాస్టర్స్లాన్తో ముందుకు సాగుతుండటంతో రియల్ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నది.
-వత్సవాయి రవి, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అధినేత
8 ఏళ్లలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది
గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పెరిగింది. ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నారు. భవిష్యత్ అవసరాలకు వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. మా వద్ద వెంచర్లలోని ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు అనేక రెట్లు లాభాన్ని పొందుతున్నారు. అనేక వెంచర్లలో పెట్టిన పెట్టుబడికి పదింతల రెట్లు వచ్చాయి. ఈ క్రమంలో వెంచర్లు చేస్తూ కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటున్నాం.
– ఎండీ లాలూసాహెబ్, అమెరికన్ టౌన్షిప్ డెవలపర్