సారపాక, జనవరి 2: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే గ్రామీణ ప్రాంతాలు పరిపుష్టిగా ఉన్నాయని, ఇందువల్లనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు మండలంలోని సాంబాయిగూడెంలో సీపీఎం, సీపీఐ సహా ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 కుటుంబాలు సోమవారం బీఆర్ఎస్లో చేరాయి. ఆ కుటుంబాల వారందరికీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులయ్యే చాలామంది ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. దేశం అభివృద్ధి చెందిందుకు బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పార్టీలో చేరినవారంతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ విజయకుమారితోపాటు సాంబాయిగూడెం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగరేణి సంస్థ ఇతర సంస్థల కంటే అద్భుత లాభాలు సాధిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరులోని ఓసీ-2, కేసీహెచ్పీ, ఏజెంట్ ఆఫీస్, ఏరియా వర్క్షాపు తదితర సింగరేణి ప్రాంతాల్లో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలోని నరేంద్రమోదీ సింగరేణిని ప్రైవేటీకరించాలని చూస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఇదే సింగరేణిని కాపాడుతున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తి విషయంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.కాగా, పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్ రేగా.. గనిలోని కార్మికులను, యూనియన్ బాధ్యులను కలుసుకుని సంస్థ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ముత్యం బాబు, అప్పారావు, వూకంటి ప్రభాకర్రావు పాల్గొన్నారు.