ఖమ్మం, ఫిబ్రవరి 24: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలుగా పార్లమెంటులో తాము చేసిన కృషి ఫలితంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాంతోపాటు ప్రధానిని, రైల్వే మంత్రులను, ఇతర కేంద్రమంత్రులను కలిసి వారితో చర్చించి లేఖలు అందించిన ఫలితంగానే జిల్లాలో పెద్ద ఎత్తున రైల్వేస్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని అన్నారు. అలాగే, కొత్త రైల్వే మార్గాలు, ఆర్వోబీలు, ఆర్యూబీ, అండర్పాస్లు నిర్మితమయ్యాయని వివరించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ముత్యాలగూడెం, మీనవోలు అండర్పాస్ , కొత్తగూడెం రోడ్ ఓవర్ బ్రిడ్జి, డోర్నకల్ – పాపటపల్లి రోడ్ అండర్ పాస్, మధిర – మోటమర్రి, ఎర్రుపాలెం – తొండల గోపవరం రోడ్ అండర్పాస్లు రూపుదిద్దుకున్నాయని అన్నారు. ఈ క్రమంలో వీటిల్లో పలు అభివృద్ధి పనులను ఈ నెల 26న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలో అమృత్ భారత్ పథకం కింద ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం, కొత్తగూడెం, మణుగూరు తదితర రైల్వే స్టేషన్ల పురోభివృద్ధికి బీఆర్ఎస్ ఎంపీగా తాను ఎంతో కృషి చేశానని, ముఖ్యంగా ఖమ్మం రైల్వేస్టేషన్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డానని వివరించారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వేలైన్ కోసం పార్లమెంట్ లో మాట్లాడడంతోపాటు 125 లేఖలు రాసినట్లు గుర్తుచేశారు.