అశ్వారావుపేట, ఏప్రిల్ 1: అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ హయాంలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరువయ్యాయి. అభివృద్ధికి నిధులు వరదలా వస్తున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛజలం అందుతున్నది. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, దళితబంధు, ట్రైకార్, గిరి వికాస్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో పథకాలు ఇంటింటికీ చేరువయ్యాయి. అంతేకాకుండా ఐటీడీఏ ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. గిరి వికాస్ ద్వారా వ్యవసాయ బోర్లు వేసి గిరిజన రైతుల పంటల సాగుకు చేయూతనిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో భాగంగా రెండు విడతల్లో 1,380 ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు అందించింది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద రూ.21.34 కోట్లతో నియోజవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. రూ.100 కోట్లతో రెండో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఇక సౌకర్యాల కల్పనలోనూ సముచిత స్థానం ఇచ్చింది. ఆర్టీఏ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటి నుంచో కలగా ఉన్న డిగ్రీ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు నియోజకవర్గ ప్రజలంతా నీరాజనం పలుకుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అశ్వారావుపేట నియోజకవర్గం.. స్వరాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. అన్ని రంగాల్లోనూ ప్రగతిని సాధించి అభివృద్ధికి బాటలు వేసుకున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ చేరాయి. అభివృద్ధి పనుల నిధులైతే వరదలా వచ్చాయి. ఫలితంగా నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో భాగంగా రెండు విడతల్లో 1,380 ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు అందించింది. రైతుబంధు పథకంలో భాగంగా ఇప్పటి వరకూ పది విడతల్లో రూ.516.65 కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని నియోజకవర్గంలోని రైతులకు అందించింది. ఇక అభివృద్ధి పనులకూ అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. రూ.39.25 కోట్లతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్ నిర్మించింది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద రూ.21.34 కోట్లతో నియోజవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. రూ.100 కోట్లతో రెండో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఇక సౌకర్యాల కల్పనలోనూ సముచిత స్థానం ఇచ్చింది. ఆర్టీఏ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటి నుంచో కలగా ఉన్న డిగ్రీ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేయనుంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు నియోజకవర్గ ప్రజలంతా నీరాజనం పలుకుతున్నారు.
రూ.64.92 కోట్ల ఐటీడీఏ నిధులతో అభివృద్ధి పనులు..
ఏజెన్సీ నియోజకవర్గమైన అశ్వారావుపేటలో ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. మొత్తం 64.92 కోట్లతో 231 పనులను పూర్తి చేసింది. భవనాలు, బీటీ రహదారులు, సబ్ సెంటర్ల నిర్మించింది. ఆశ్రమ పాఠశాలలకు మరమ్మతులు చేపట్టింది.
సబ్ ట్రెజరీ కార్యాలయం..
ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం అశ్వారావుపేటలో సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ప్రజలు, ఉద్యోగులు ట్రెజరీ సేవల కోసం సత్తుపల్లి వరకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లి పనులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సరికి ఒక రోజు సమయం పట్టేది. అశ్వారావుపేటలోనే కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల సబ్ ట్రెజరీ సేవలు ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
దమ్మపేటలో త్వరలో కోర్టు..
నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవల కోసం రాష్ట్రం ప్రభుత్వం దమ్మపేటలో కోర్టును ఏర్పాటు చేస్తోంది. పాత ఎస్సీ హాస్టల్ భవనాన్ని జిల్లా న్యాయస్థానం అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు కోర్టు ఏర్పాటుకు అనుమతి కోసం నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. త్వరలో ఈ కోర్టు అందుబాటులోకి వస్తే.. 100 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
రూ.9 కోట్లతో గోదాముల నిర్మాణం..
రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవటానికి రాష్ట్రప్రభుత్వం గోదాములు నిర్మించింది. నియోజకవర్గంలో రూ.9 కోట్లతో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాలుగు గోదాములను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అందుబాటులోకి ఆర్టీఏ సేవలు..
అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఆర్టీఏ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నియోజకవర్గ ప్రజలు గతంలో సత్తుపల్లిలో ఈ సేవలను వినియోగించుకునే వారు. జిల్లాల విభజన కారణంగా ఈ సేవలు కొత్తగూడేనికి వెళ్లిపోయాయి. దీంతో అశ్వారావుపేట నుంచి సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించేందుకు ఇక్కడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల విజ్ఙప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేటలో ఆర్టీఏ సబ్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 14న మంత్రి అజయ్కుమార్, ఎమ్మెల్యే మెచ్చా కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సీఎంఆర్ఎఫ్తో పేదల ఆరోగ్యానికి భరోసా..
అత్యవసర సమయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద సేవలు పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) భరసానిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు.
మెరుగైన వైద్య సేవలు..
నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సదుపాయాలూ ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే గర్భిణులకు పౌష్టికాహారం అందించేలా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సాహించేలా కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తోంది. అసంక్రమిత వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు చికిత్స అందించేలా పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. డయాలసిస్ సేవలను రోగులకు దగ్గర చేసింది.
నిరుపేదలకు పండుగ దుస్తులు..
నిరుపేదలు కూడా పండుగ రోజున ఆనందంగా గడపాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆయా పండుగలకు దుస్తులు పంపిణీ చేస్తోంది. బతుకమ్మ పండగకు గాను ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేస్తోంది. ముస్లింలకు రంజాన్ తోఫాను, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ఏటా పంపిణీ అందిస్తోంది. నియోజకవర్గానికి 1000 గిఫ్టులు అందించడంతోపాటు వేడుకల నిర్వాహణ కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా మంజూరు చేస్తోంది.
త్వరలో డిగ్రీ కళాశాల..
అశ్వారావుపేటకు డిగ్రీ కళాశాల మంజూరయ్యేలా ఎమ్మెల్యే మెచ్చా విశేష కృషి చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పాల్వంచ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్న అప్పయ్య ఈ నెల 13న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ప్రకటించారు.
సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు, డివైడర్లకు రూ.39.25 కోట్లు
గిరిజన నియోజవర్గంలోని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్తోపాటు డ్రైనేజీ, డివైడర్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.39.25 కోట్లు మంజూరయ్యాయి. అశ్వారావుపేటకు రూ.23.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 9న జీవో విడుదల చేసింది. ఆ ప్రతులను స్వయంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మెచ్చాకు అందజేశారు. అదేవిధంగా దమ్మపేట మండలం మందలపల్లి, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లోనూ సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణం కోసం కలెక్టర్ డీఎంఎఫ్ స్కీం కింద రూ.15.75 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అతి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
సెంట్రల్ లైటింగ్ రావడం సంతోషకరం..
నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.23.50 కోట్లు మంజూరు చేసింది. నిధుల మంజూరు జీవోను స్వయంగా సీఎం కేసీఆరే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావకు అందజేశారు. సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయటం పట్ల పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఎంపీపీ, అశ్వారావుపేట
731 మందికి ‘రైతుబీమా’
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తోంది. ఏదైనా కారణం చేత రైతు మృతి చెందితే అతడి కుటుంబానికి ఈ పథకం కింద రూ.5 లక్షల బీమా పరిహారాన్ని అందిస్తోంది. ఇందులో బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. వివిధ కారణాలతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 731 మంది రైతులు మృతిచెందారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.36.55 కోట్ల బీమా పరిహారం అందింది. కుటుంబాలకు కొండంత భరోసానిచ్చింది.
రూ.5 లక్షల బీమా సొమ్ము అందింది..
మాకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు అందించింది. ఈ సొమ్ము వ్యవసాయ పెట్టుబడికి ఎంతో ఉపయోగపడింది. 2021 కరోనా సమయంలో నా భర్త పెద్ద పుల్లారావు మృతిచెందాడు. ప్రభుత్వం రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారాన్ని అందించింది. ఈ సొమ్ము నా కుటుంబ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడింది. కుటుంబ పెద్ద లేని లేటు తీర్చలేకున్నా.. కుటుంబానికి భరోసా కలుగుతోంది. -జంగాల వెంకటలక్ష్మి, దమ్మపేట