కూసుమంచి (నేలకొండపల్లి), జనవరి 21: ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని సిద్దార్థ యోగా విద్యాలయంలో ఆదివారం నిర్వాహకుడు డాక్టర్ రామచందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్థ వార్షికోత్సవం, ఆరోగ్య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యవంతులతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రతిఒక్కరూ మహాత్మాగాంధీ చూపిన ప్రకృతి జీనవ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు.
మన చుట్టూ ఉండే ప్రాంతంలో లెక్కలేనని ఔషధ మొక్కలు ఉంటాయని, వాటి గురించి తెలుసుకుని, ఔషధంగా తీసుకుని ఆరోగ్యవంతులు కావొచ్చన్నారు. డాక్టర్ రామచందర్రావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ‘నో ఆయిల్.. నో బాయిల్’ విధానాన్ని అనుసరించి దీర్ఘాయుష్షు పొందవచ్చన్నారు. కార్యక్రమానికి సుమారు 3,000 మంది దేశ, విదేశ ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం అతిథులు ఆరోగ్యసమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రదర్శనకు ఉంచిన బియ్యం, నాటు కూరగాయలు, విత్తన స్టాళ్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ, జానపద గాయకుడు నాగన్న, పౌల్ట్రీ రంగ నిపుణుడు సి.బలరాం ప్రసాద్ పాల్గొన్నారు.