మధిర, మే 27 : ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనుల ముసుగులో ఒక ఎకరం భూమిని ఏకంగా రూ.ఆరు కోట్లకు ప్రభుత్వానికి కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచుకోవాలని చూసిన భారీ కుంభకోణం స్థానికంగా ఒకసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. రూ.129 కోట్లతో మధిరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంజూరు చేసుకున్నారు. దాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడులో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణానికి ప్రతిపాదించిన చీకటి వాగు సమీపంలోని స్థలాన్ని మధిర డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో ఈ అవినీతి బాగోతం బట్టబయలైంది.
వరద ముంపు భూమికి రూ.6 కోట్ల అంచనాలా?
మధిరలో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ‘డెవలప్మెంట్ కమిటీ’ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ నాయకులనే ఎక్కువగా నియమించారు. సీపీఐ, టీడీపీ నాయకులకు కూడా చోటు కల్పించారు. ఈ కమిటీ సభ్యులంతా కలిసి బుధవారం వెళ్లి సదరు భూమిని పరిశీలించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ రైతు.. ప్రతిపాదిత భూమి పక్కనే తన భూమిని ఎకరం రూ.కోటిన్నరకే ఇస్తానంటూ కమిటీ సభ్యులకు చెప్పాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వర్షాకాలంలో పూర్తిగా వరద ముంపునకు గురయ్యే పనికిరాని ఆ భూమిని.. భారీ ధర పలికే స్థలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ చూపించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పావులు కదిపారు. మున్సిపల్ అధికారులు కూడా దీనికి ‘సై’ అన్నారు. ఫైనల్ క్లియర్ అయితే రూ.కోట్లు వెనకేసుకోవచ్చని ఆశించారు. కానీ, ఈలోపే అదే కాంగ్రెస్ నాయకులతో కూడిన డెవలప్మెంట్ కమిటీ సభ్యుల సమక్షంలో వ్యవహారం బయటకు పొకడంతో పరిస్థితి తారుమారైంది.
పకనే కోటిన్నర..
రూ.ఆరు కోట్ల అంచనాలతో పెట్టిన ఈ స్థలానికి అతి సమీపంలోనే ఉన్న మరో రైతు.. తన భూమిని ఎకరం రూ.కోటిన్నరకే ప్రభుత్వానికి ఇస్తానని ముందుకు రావడంతో డెవలప్మెంట్ కమిటీ సభ్యులు షాక్కు గురయ్యారు. ప్రతిపాదిత భూమిని పరిశీలించేందుకు వెళ్లిన సదరు కమిటీ సభ్యులు.. ఆ రైతు భూమిని కూడా చూశారు. మంచి భూమిని రూ.కోటిన్నరకే లభిస్తుండగా.. వరద ముంపునకు గురయ్యే తకువ ధర గల ప్రతిపాదిత భూమికి రూ.6 కోట్లతో అంచనాలు వేయడమేంటని అనుమానం వ్యక్తం చేసి ఆరా తీశారు.
సదరు కాంగ్రెస్ కౌన్సిలర్, రియల్టర్లు వేసిన స్కెచ్ను చూసి ముక్కున వేలేసుకున్నారు. తక్కువ ధర గల భూమిని ప్రభుత్వానికి కట్టబెట్టి రూ.కోట్లు కొల్లగొట్టాలన్న ప్లాన్ను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆయన కూడా సీరియస్ అయినట్లు సమాచారం. కాగా, సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, సదరు భూములను పరిశీలించిన వారిలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులైన కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిర్యాల రమణగుప్తా, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ, సీపీఐ నాయకుడు బెజవాడ రవి తదితరులు ఉన్నారు.