సారపాక/భద్రాచలం, మార్చి 28 : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేయకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం సారపాక ఐటీసీ పీఎస్పీడీలోని మయూరి క్లబ్లో జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పొరుగు రాష్ర్టాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి సమన్వయంతో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎన్నికల దృష్ట్యా పొరుగు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున మద్యం, గంజాయి, నాటుసారా తరలించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించుకుంటూ సమష్టిగా దాడులు నిర్వహించాలని, ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచందర్రావు, ఏలూరు, సుక్మా, బీజాపూర్, కొత్తగూడెం జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణ, గజేందర్, రాథోడ్, రాహుల్, కరమ్చంద్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.