భద్రాచలం, ఫిబ్రవరి 18: గిరిజనుల అభ్యున్నతే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని, అందుకు అనుగుణంగా ఐటీడీఏ యంత్రాంగం పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అందుకు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యతోనే గిరిజనుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు అవకాశాలు కల్పించాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మళ్లీ ఇందిర జలప్రభ పథకాన్ని అమలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. భద్రాచలంలో కరకట్ట నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజన యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందేందుకు సాయం అందిస్తామన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి, సంఘాలు బలోపేతం చేస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ‘న్యాక్’ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి జిల్లాలో అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గూడేల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా కొండరెడ్లు నివసిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ట్రైకార్ ద్వారా గిరిజనులకు 80శాతం సర్సిడీపై రుణాలు అందిస్తున్నామన్నారు. ఏజెన్సీలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారి కోసం ప్రత్యేక వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గిరిజన రైతులకు వందశాతం రాయితీపై మోటరు, బోరు అందిస్తున్నామన్నారు. అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు అందించామన్నారు. మంత్రులు అనంతరం కొందరికి ట్రైకార్ రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు, ఓఎస్డీ కృష్ణభాస్కర్, భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్ పాల్గొన్నారు.