మణుగూరుటౌన్, డిసెంబర్ 30: భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణ శివారులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)ను శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సందర్శించారు. తొలుత హెలికాఫ్టర్ ద్వారా మణుగూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ఆయనకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం రోడ్డు మార్గం ద్వారా బీటీపీఎస్కు చేరుకున్నారు. ఆయనకు బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, జెన్కో అధికారులు స్వాగతం పలికారు. సీఈ బిచ్చన్న డిప్యూటీ సీఎంకు ప్లాంట్ పరిధిలో విద్యుత్ ఉత్పత్తి, రవాణా గురించి వివరించారు.