భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం సింగరేణి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయడమే మా లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం పాల్వంచలో సుగుణగార్డెన్స్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏర్పాటు చేసిన మంత్రుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు.వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. ఖమ్మంజిల్లాలో పాలేరు వరకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు రైతులకు ఇస్తామని తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రెవెన్యూశాఖలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తానన్నారు. పాల్వంచ, కొత్తగూడెంలో భూముల సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు హామీలు ఇవ్వడంతోపాటు వాటికి చట్టబద్దత కల్పించిందన్నారు. ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, రాందాస్నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. పాల్వంచలో సుగుణాగార్డెన్స్ అభినందనసభలో ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలకు కలెక్టర్ ప్రియాంక ఆల పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.
మంత్రులకు సింగరేణి డైరెక్టర్ల స్వాగతం.. : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్రెడ్డి స్వాగతం పలికారు.కార్యక్రమంలో జీఎం పర్సనల్ బసవయ్య, జీఎం సెక్యూరిటీ బీఆర్ దీక్షితులు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శశిధర్రాజు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.