వర్షాలు కాస్త విరామమివ్వడంతో దోమలు స్వైరవిహారం మొదలుపెట్టాయి. నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. రోజువారీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఊరూరా పర్యటిస్తూ, ఆ రోజుల్లో పూర్తి డ్రైడేలు పాటిస్తూ జాగ్రత్తలు ముఖ్యమని చెబుతున్నారు. వానకాలం నిత్యం అప్రమత్తంగా ఉండాలని అవగాహనపరుస్తున్నారు.
ఖమ్మం, ఆగస్టు 6: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఇప్పుడు కాస్త తెరపి ఇవ్వడంతో దోమలు విజృంభిస్తున్నాయి. వీటి కారణంగా డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమై జ్వరాలు విజృంభించే అవకాశముంది. అలాగే పారిశుధ్యం లోపిస్తే మిగతా సీజనల్ వ్యాధులు వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజన్లో ఇప్పటికే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయి. ఇక చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలూ క్యూ కడుతుంటాయి. నీరు కలుషితమైతే డయేరియా వ్యాపించే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే వైద్యులు అనేక జాగ్రత్తలు చెబుతున్నారు.
నిత్యం అప్రమ్తంగా ఉండాలని, పారిశుధ్య చర్యలు పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సీజనల్ వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభత్ర వంటి ఆవశ్యకతలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో గ్రామగ్రామానా పర్యటిస్తూ, ఆ రోజుల్లో పూర్తి డ్రైడేలు పాటిస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల్లో స్వయంగా ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి కూడా పాల్గొంటూ పాత టైర్లు, వాడని కూలర్లు, పూల కుండీలు వంటి వాటిల్లో నిల్వ ఉన్న నీటిని తొలిస్తున్నారు. అయితే ఏయే జ్వరాలు, వ్యాధులు ఎంతో తీవ్రంగా ఉంటాయి? వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనే అంశాలపై ఓ కథనం.
పొంచి ఉన్న మలేరియా, డయేరియా..
కేవలం ఎనాఫిలస్ అనే ఆడ దోమ కుట్టడం ద్వారానే మలేరియా వస్తుంది. దీనిలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సీఫారమ్ అనే రెండు రకాలు ఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన చలి, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇలాంటి కేసులను తక్షణమే గుర్తించి వైద్యం అందించకపోతే కాలేయం, మూత్రపిండాలు, రక్త నాళాలపై ప్రభావం పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో మెదడుకు సోకి సెరబ్రల్ మలేరియాకు కూడా దారితీస్తుంది. ఇక కలుషితమైన నీటిని నేరుగా తాగటం వల్ల డయేరియా, కామెర్లు, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముంది. నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయి.
డెంగీ..
ఏడిస్ ఈజిప్ట్ దోమకాటు కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు, ముక్కు, మలం ద్వారా రక్తం పోవడం తదితర లక్షణాలు ఉంటాయి.
మెదడువాపు
వ్యాధి..
క్యూలెక్స్ దోమ కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది ఎక్కువగా 15 ఏళ్లలోపు పిల్లలకు వస్తుంది. చిన్నప్పుడే వ్యాక్సిన్ వేయించడం వల్ల వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. జ్వరం వచ్చి తగ్గుతూ ఉండడం ఈ వ్యాధి లక్షణం. తగ్గిన చికిత్స చేయించకపోతే పక్షవాతం, ఫిట్స్ వచ్చి శాశ్వతంగా అంగవైకల్యంగా మారే ప్రమాదం ఉంది.
దోమకాటుతోనే విష జ్వరాలు..
సాధారణంగా వర్షాకాలంలో చాలు దోమల బెడద తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా దోమకాటు ద్వారానే విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. ఖాళీ ప్రదేశాలు, మురుగు గుంతలు, డ్రైనేజీల్లో నిల్వ ఉండే నీటిలో పెరిగే దోమలు ఎంతో ప్రమాదకరమైనవి. క్షేత్రస్థాయిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వీటికి ఆవాసాలు ఉండవు. దీంతో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండదు.
పైలేరియా..
పైలేరియా కూడా క్యూలెక్స్ దోమ కాటు ద్వారానే సోకుతుంది. తరుచుగా జ్వరం రావడం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, శరీరంలోని అవయవాల వాపు వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. వ్యాధి లక్షణాలు గుర్తించి సకాలంలో వైద్యం చేయించకపోతే బోదకాలుతో శాశ్వతంగా బాధపడాల్సి వస్తుంది.
జాగ్రత్తలు ఇవే..
క్లోరినేషన్ చేసిన రక్షణ నీటిని తాగాలి.
వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూతలు ఉంచాలి.దుమ్ము, ధూళి పడకుండా, ఈగలు వాలకుండా చూడాలి.
నీటి వనరులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
భోజనానికి ముందు, మలమూత్ర విసర్జనల తరువాత చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలి.
దోమలు పెరిగేందుకు అనువుగా ఉండే నీటి నిల్వలను నిర్మూలించాలి.
తాగి పారేసిన కొబ్బరి బొండాలను ముక్కలుగా చేసి చెత్త కుండిలో వేయాలి.
ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి నిల్వ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
వ్యర్థాలు, చెత్త, చెట్ల కొమ్మలను కాల్వల్లో వేయొద్దు.
పూలకుండీల తొట్టెల్లోని నీటిని వారానికి ఒకసారి మార్చాలి.
ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు సన్న జాలిని కట్టాలి. దోమతెరలు తప్పనిసరిగా వాడాలి.
వారంలో ఓ రోజును డ్రైడేగా పాటించాలి.
చేయకూడని పనులు..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముంటుంది. ఈ కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా చేయవద్దు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఫాగింగ్ చేస్తున్నాం. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే ఆ నీటిని తొలగించి శుభ్రం చేయాలి. ఆహారం తినే విషయంలో, తాగే నీటి విషయంలో కనీస జాగ్రత్తలను పాటించాలి. వీటిల్లో చేసే చిన్న పొరపాట్లే వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతుంటాయి. కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉండాలి.
-ఆదర్శ్ సురభి, కేఎంసీ కమిషనర్