తిరుమలయపాలెం, మే 23 : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్ల గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాల్వలో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు కంప కట్టెలను కూలీలతో తొలగించకుండా పంచాయతీ కార్యదర్శి నిప్పు పెట్టించాడు. చెత్తా చెదారానికి అంటించిన అగ్ని వ్యాప్తి చెంది చెరువుగట్టుపై ఉన్న ఈత చెట్లన్నీ కాలిపోయాయి. దీంతో ఉపాధి హామీ పనుల పేరుతో మంట పెట్టి మా జీవనాధారాన్ని మంటలో కలిపేశారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు తగలబడుతుంటే వాటిని రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదని వారు మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈత చెట్లు కాలిపోయేందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గీత కార్మికులు కోరారు.

పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం.. దమ్మైగూడెంలో కాలిపోయిన ఈత చెట్లు