ఇల్లందు, మార్చి 25 : అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు(Road works) త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని దాసు తండా గ్రామస్తులు అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలోని బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు టేకులపల్లి మండల కేంద్రం మీదుగా బోడు గ్రామానికి వెళ్తున్న కలెక్టర్ వాహనాన్ని దాస్ తండా గ్రామస్తులు రోడ్డుపై నిలబడి అడ్డుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారన్నారు.
ఈ మార్గంలో కోయగూడెం ఓసి నుండి వివిధ ప్రాంతాలకు బొగ్గును లారీలు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో ఇండ్లలోకి దుమ్ము, ధూళి చేరి అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ వారం రోజుల్లో తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేపిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.