రామవరం, మార్చి 26 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంఖని, సత్తుపల్లిలోని జేవీఆర్వోసీ, కిష్టారం ఓసీల ప్రభావిత పల్లెల్లో చీకట్లు కమ్ముకున్నాయి. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సోలార్ వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. కొత్తగూడెం ఏరియా అప్పటి జీఎం జక్కం రమేశ్ ప్రత్యేక చొరవతో పంచాయతీల్లో అవసరాలకనుగుణంగా సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు. సుమారు రూ.85 లక్షల వ్యయంతో 540 సోలార్ వీధి దీపాలను 140 యూనిట్లలో ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్లో 4 స్తంభాలు, నాలుగు లైట్లు, రెండు బ్యాటరీలు, రెండు సోలార్ ప్యానల్ ఉంటాయి. పంచాయతీలకు విద్యుత్ ఆదాతోపాటు నిర్వహణ భారం తగ్గుతుందని ప్రారంభించిన ఈ విద్యుత్ దీపాలు మున్నాళ్ల ముచ్చటగా వెలిగాయి. వర్షాలకు చాలాచోట్ల స్తంభాలు నేలకొరిగాయి. అధికారులు స్పందించి సోలార్ దీపాలు వెలిగేలా చూడాలని పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
సోలార్ విద్యుత్దీపాలు ఏర్పాటు చేసిన సంస్థ మూడు సంవత్సరాలపాటు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ కనీస ప్రమాణాలను కూడా పాటించకపోవంతో వర్షాకాలంలో చాలా లైట్లు నేలకొరిగాయి. పలుచోట్ల లైట్లను చోరులు ఎత్తుకెళ్లారు. ఆయా పంచాయతీల సర్పంచ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కార్మికులు చిన్నతప్పు చేస్తేనే సహించని అధికారులు రూ.85 లక్షలు వృథాగా పోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.