చింతకాని, జనవరి 27: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. రూ.34 లక్షల ఎంపీ లాడ్స్, జడ్పీ నిధులతో మండలంలో పాతర్లపాడు గ్రామంలో నిర్మించిన నూతన పాఠశాల భవన సముదాయాన్ని, 10 దళితబంధు యూనిట్లను శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు.
దళితబంధు పథకం కింద మండల వ్యాప్తంగా 3,462 కుటుంబాలకు యూనిట్లు పంపిణీ చేశామని అన్నారు. లబ్ధిదారులందరూ వాటిని సద్వినియోగించుకోవాలని సూచించారు. దళితబంధు లాంటి పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని, తామంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్లమేనని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కూడా దేశంలో మరెక్కడా లేవని అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలూ సంతోషంగా ఉన్నాయని అన్నారు. అయతే రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై అక్కసు ప్రదర్శిస్తోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎరువులు, విత్తనాల కోసం సమైక్య పాలనలో లాఠీ దెబ్బలు తిన్న ఘటనలను, చెప్పుల వరుసలుగా పేర్చిన విషయాలను రైతులు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కలెక్టర్ వీపీ గౌతమ్, డీఈవో సోమశేఖరశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కాండ్రి పిచ్చయ్య, కోపూరి పూర్ణయ్య, పర్చగాని తిరుపతి కిశోర్, నూతలపాటి వెంకటేశ్వర్లు, మంకెన రమేశ్, బోడ్డు వెంకట్రామయ్య, వంకాయలపాటి లచ్చయ్య, నల్లమోతు శేషగిరిరావు, తాళ్లూరి బాలాజీ, సామినేని అప్పారావు, మండెపూడి కృష్ణయ్య, శ్రీను, మంగీలాల్, దుర్గాభవాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్ల పరిశీలన..
మండలంలోని వందనం, నరసింహపురం తదితర గ్రామాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం పర్యటించారు. దళితబంధు యూనిట్లను పరిశీలించి ఆదాయ వ్యయాలు, వనరులు తదితర అంశాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ట్రైనీ కలెక్టర్ రాధికా గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.