దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. వారికి జీవనోపాధికి ఊతం ఇవ్వడంతోపాటు ఎస్సీల ఆర్థికాభివృద్ధికి చేయూతనందించేలా రూ.10 లక్షలు అందజేస్తున్నది. అంతేకాదు, లబ్ధిదా రులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా పథకం వర్తింపజేస్తున్నది. ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గంలో 100 మందికి యూనిట్లు మంజూరు చేసింది. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇటీవల ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ యూనిట్లు పంపిణీ చేశారు. తమను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదని, దళితుల ప్రగతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
కూసుమంచి, జూలై 27: ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎస్సీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘దళిత బంధు’. ఎలాంటి తాకట్టు, ష్యూరిటీలు లేకుండానే లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందజేస్తున్న ఏకైక పథకం. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాలు ఎంపిక చేయగా వీటిలో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం ఎంపికైంది. ఈ మండలంలో సుమారు 3,500 మంది ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం యూనిట్లు మం జూరు చేసింది. ఇవి కాక ఇతర నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున పథకానికి ఎంపికయ్యారు. దీనిలో భాగంగా పాలేరు నియోజకవర్గంలోనూ 100 మందికి యూనిట్లు మంజూరయ్యాయి. ఈనెల 23న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. యూనిట్లు అందుకున్న వారంతా సీఎం కేసీఆర్ తమ కుటుంబాలను ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్లను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివరాలు వారి మాటల్లోనే..
లబ్ధిదారుడికి మంజూరైన వాహనదారులకు తాళం అందజేస్తున్న ఎమ్మెల్యే కందాళ, పక్కన ఎమ్మెల్సీ తాతా మధు (ఫైల్)
జీవితంలో స్థిరపడతా..
నేను డిగ్రీ పూర్తి చేశాను. అమ్మానాన్న కూలీ పనులకు పోతరు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. నేను చిన్న పనులు చేసుకుంటూ వాళ్లని పోషించుకుంటున్నా. మా కుటుంబానికి దళిత బంధు మంజూరైంది. రూ.10 లక్షల యూనిట్ వస్తుందని తెలిసి ఆనందపడినా. తిరిగి కిస్తీలు కట్టకుండా ఈ రోజుల్లో డబ్బులెవరు ఇస్తరు. ప్రభుత్వం ఇస్తున్నది. నాకు రూ.6.23 లక్షల విలువైన ట్రాలీ మంజూరైంది. మిగిలిన డబ్బులతో డీజే సామాను కొంటా. జీవితంలో స్థిరపడడానికి ఇది మంచి అవకాశమని భావిస్తున్నా.
– కార్తీక్, లబ్ధిదారుడు, కూసుమంచి
పార్టీలకు అతీతంగా పథకం వర్తింపు..
నేను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దళితబంధు గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నా. నాకు ట్రాక్టర్ యూనిట్ మంజూరైంది. నేనిప్పుడు ట్రాక్టర్ యజమానిని. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా. దళితబంధు ఇప్పుడు జీవితంపై భరోసా కల్పించింది. మా కుటుంబం సంతోషంగా ఉంది. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పథకం మంజూరు చేస్తున్నది. ట్రాక్టర్ మంచిగా నడుపుకొన్ని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటా.
– బండ్ల వెంకటరత్నం, లబ్ధిదారుడు, రాజారాంపేట, నేలకొండపల్లి మండలం
మరొకరికి ఉపాధినిస్తా..
బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటే వాటిని తిరిగి చెల్లించాల్సి వచ్చేది. కొన్ని రకాల రుణాలకు సబ్సిడీ ఉండేది. కొన్నింటికీ అదీ లేకపోయేది. కానీ ఎస్సీల కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో ప్రభుత్వం రూ.10 లక్షల విలువైన యూనిట్ను ఉచితంగా ఇస్తున్నది. ఇంతకంటే ఇంకేం కావాలి. పథకంలో భాగంగా నాకు ట్రాక్టర్ మంజూరైంది. ఇంత కన్నా ఏం కావాలి మాకు. నేను ఉపాధి పొందడంతోపాటు మరొకరికి ఉపాధినిస్తా. సీఎం కేసీఆర్ పథకంతో ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
– గాజుల వీరస్వామి, లబ్ధిదారుడు, ఏలివారిగూడెం, తిరుమలాయపాలెం మండలం
డ్రైవర్ నుంచి యజమానినయ్యా..
నేను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు దళిత బంధు మంజూరైంది. గతంలో బస్తాలు మోశాను. కూలి పనులు చేశాను. యాక్టింగ్ డ్రైవర్గా పని చేశాను. నాకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్తో జీవితంలో స్థిరపడతా. ఇప్పుడు నేను డ్రైవర్ నుంచి యజమానినయ్యాను. కష్టపడి పనిచేస్తా. మాలాంటి నిరుపేదలకు యూనిట్ అందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– చిన అంజయ్య, లబ్ధిదారుడు, కూసుమంచి
మీ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తా..
నా భర్త కేశవులు కొన్నాళ్ల క్రితం కరోనాతో చనిపోయాడు. ఎలా బతకాలి. ఇద్దరు కుమారులను ఎలా చదివించుకోవాలన్న బాధ ఉండేది. బట్టలు కుట్టుకుంటూ వారిని పోషిస్తున్నా. దళితబంధు మంజూరు చేస్తున్నారని తెలుసుకుని నేనూ దరఖాస్తు చేసుకున్నా. నాకు పథకం మంజూరైంది. మీ సేవా కేంద్రం నెలకొల్పుతున్నా. మా కుటుంబానికి దళితబంధు మంజూరవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కేంద్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటా. సీఎం కేసీఆర్ దేవుడిలా మా కుటుంబాన్ని ఆదుకున్నారు. – చందం పద్మ, లబ్ధిదారురాలు, అమ్మగూడెం, నేలకొండపల్లి మండలం