మామిళ్లగూడెం, మార్చి 14 : గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ వాట్సాప్, ఎస్ఎంఎస్ల లింకులు, తక్షణమే డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడగడం, కేవైసీ అప్డేట్ పేరుతో ఓటీపీ అడగడం వంటి మోసపూరిత చర్యల్లో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, తెలియని లింక్లను క్లిక్ చేయకూడదని కోరారు. ఇవి వ్యక్తిగత వివరాలను, డబ్బును దొంగిలించడానికి పన్నే పన్నాగంగా గ్రహించాలన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీకి ముందు ఆన్లైన్లో అడ్వాన్స్ పేమెంట్ చేయమని కోరితే అది మోసమని గ్రహించాలని, ఓటీపీ, యూపీఐ పిన్ షేర్ చేయవద్దని, కేవైసీ అప్డేట్ లేదా సబ్సిడీ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంక్ వివరాలు లేదా యూపీఐ పిన్ అడిగితే అస్సలు చెప్పరాదని హెచ్చరించారు.
గ్యాస్ సిలిండర్ను అధికారిక మొబైల్ యాప్లు, ఏజెన్సీ వెబ్సైట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలన్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవసరమైతే cybercrime.gov.inలో రిపోర్టు చేయాలని తెలిపారు.